Madhya Pradesh : గతంలో అనేక మంది కోట్ల సంపదను వదులుకొని సన్యాసిగా మారారు. అలాంటి మరో ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. ఏడాదికి కోటికి పైగా వేతనం ఉన్నా సరే..ఆ ఉద్యోగాన్ని వదులుకొని జైన సన్యాసిగా మారేందుకు సిద్ధమయ్యారి ప్రన్సుఖ్ కాంతేడ్.
ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రన్సుఖ్ 2016లో అమెరికా వెళ్లాడు. అక్కడ ఏడాదిన్నర పాటు చదివి డేటా సైంటిస్ట్గా మంచి ఉద్యోగం సంపాదించాడు.
నెలకు పది లక్షలకు పైగానే వేతనాన్ని ఆర్జించడం మొదలు పెట్టాడు ప్రన్సుఖ్. లక్షల్లో జీతం వచ్చినా.. అతను సంతృప్తి చెందలేదు. మనసు ఆధ్యాత్మికం వైపు మళ్లింది. ఇక జైన సన్యాసిగా మారాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్న తడవుగా 2021 జనవరిలో అమెరికాలో ఉన్న ఉద్యోగం వదిలేసి భారత్కు తిరిగి వచ్చాడు.
మరో ఐదు రోజుల్లో..అంటే డిసెంబర్ 26న జైన సన్యాసిగా ఓ ప్రముఖ గురువు జినేంద్ర ముని వద్ద దీక్ష తీసుకోనున్నారు. ఈ కార్యక్రమానికి 53 మంది జైన సన్యాసులు హాజరుకానున్నారు. కొడుకు సన్యాసిగా మారుతుండడంతో తల్లితండ్రులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.