మధ్యప్రదేశ్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. రాజ్గఢ్లోని పిప్లియా రసోడా గ్రామంలో ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చిన్నారి కనిపించక పోవడంతో కుటుంబసభ్యులు పరిసరాలన్నీ గాలించారు. చివరకు బాలిక బోరుబావిలో పడిందని గుర్తించారు.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో NDRF, SDRF బృందాలు రంగంలోకి దిగాయి. రాజ్ గఢ్ కలెక్టర్ హర్ష్ దీక్షిత్, రాజ్ గఢ్ ఎస్పీ ధరమ్ రాజ్ మీనా ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక సుమారు 30 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించి సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ, ఇతర పరికరాల సహాయంతో బోరుబావికి సమాంతరంగా తవ్వుతూ వెళ్లగా.. 22 అడుగుల వద్ద చిన్నారి ఏడుపును గుర్తించారు. పాప బ్రతికే ఉందని గ్రహించి.. వెంటనే ఆక్సిజన్ ను లోపలికి పంపారు. సుమారు 9 గంటల పాటు శ్రమించి.. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో బాలికను బయటకు తీశారు. వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.