Madhya Pradesh urination case(Latest breaking news in telugu): మధ్యప్రదేశ్లో ఓ గిరిజనుడిపై మూత్ర విసర్జన ఘటన తీవ్ర దుమారం రేపింది. సిధి జిల్లాలో రోజువారీ కూలీగా పని చేస్తున్న దశమత్ రావత్ అనే వ్యక్తిపై నిందితుడు ప్రవేశ్ శుక్లా మూత్రం పోశాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనను దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో ఖండించారు. నిందితుడు ప్రవేశ్ శుక్లాను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాతీయ భద్రతా చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.
తాజాగా మూత్ర విసర్జన ఘటనలో బాధితుడిని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సన్మానించారు.భోపాల్లోని తన నివాసంలో దశమత్ రావత్ కాళ్లు కడిగి, సాలువా కప్పి సత్కరించారు. అతడిని కుర్చీలో కూర్చొబెట్టి సీఎం కింద కూర్చున్నారు. రావత్ రెండు కాళ్లను ప్లేట్లో ఉంచి పాదాలను నీళ్లతో కడిగారు . అతనికి బొట్టు పెట్టి పూలమాల వేశారు. శాలువ కప్పి సన్మానం చేశారు.
మూత్ర విసర్జన ఘటన విషయం తెలియగానే సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విటర్ ద్వారా స్పందించారు. నేరస్తుడిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. యూపీలో యోగీ ఆదిత్య నాథ్ బుల్ డోజర్ విధానాన్ని మధ్యప్రదేశ్ సర్కార్ కూడా అమలు చేసింది. గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన ప్రవేశ్ శుక్లా ఇంటిని అధికారులు కూల్చి వేశారు.