లోక్సభ స్పీకర్ ఓంబిర్లా తీవ్ర ఆవేదన చెందారు. ఇకపై తాను సభకు హాజరుకాబోనంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. సభ గౌరవానికి తగ్గట్లుగా సభ్యులు ప్రవర్తించడం లేదని స్పీకర్ ఓం బిర్లా ఆరోపించారు. విపక్ష సభ్యులు తమ ప్రవర్తనను మార్చుకునే వరకు తాను సభకు హాజరుకాబోనని స్పష్టం చేశారు.
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై పది రోజులు అవుతోంది. ప్రారంభమైన మొదటి రోజు నుంచి మణిపూర్ అంశం చర్చనీయాంశమైంది. మణిపూర్ ఘటనలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కారణంగానే ఉభయ సభల్లోనూ వాయిదాల సర్వం కొనసాగుతోంది.
ప్రతీ రోజూ సభలు ప్రారంభం కావడం, విపక్ష సభ్యులు మణిపూర్ అంశాన్ని ప్రస్తావించడం, ప్రభుత్వం సమాధానం చెప్పకపోవడం, విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడం నిత్యకృత్యమయ్యాయి. దీంతో లోక్సభను సమర్థవంతంగా నడపలేకపోతున్నానన్న భావనలో స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు.