Lok Sabha Election 2024 : సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఎలక్షన్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే వచ్చే వారం నుంచి వివిధ రాష్ట్రాల్లో ఈసీ అధికారులు పర్యటించనున్నారు. తొలి దశలో దక్షిణాది రాష్ట్రాల్లో మీటింగ్స్ ఏర్పాటు చేయనున్నారు.
కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అరుణ్ గోయల్, అనూప్ చంద్ర పాండే జనవరి 7 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తారు. జనవరి 7- 10 మధ్య తమిళనాడు, ఏపీకి వెళతారు. ఇప్పటికే డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు అన్ని రాష్ట్రాల్లో పర్యటించారు. పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈసీ బృందం రాష్ట్రాల టూర్ కు ముందు.. ఎన్నికల సంఘానికి ఆ రిపోర్ట్ ఇవ్వనున్నారు.
రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు, సీనియర్ పోలీసు అధికారులు, పాలనా విభాగ ఆఫీసర్స్, క్షేత్రస్థాయిలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందితో ఈసీ సమీక్షలు నిర్వహిస్తుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్ల పర్యటిస్తుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవలే ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఈసీ బృందం పర్యటించదని తెలుస్తోంది. ఈసీ టూర్ పూర్తైన తర్వాత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రిలీజయ్యే ఛాన్స్ ఉంది.
2019లో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. నాడు ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 దశల్లో పోలింగ్ జరిగింది. మే 23న లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 2024 ఎన్నికలు కూడా ఏప్రిల్-మే నెలల్లోనే నిర్వహించే అవకాశాలున్నాయి.