Loan Offer : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI.. స్వయం సహాయక బృందాలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.20 లక్షల వరకు రుణాలు ఇస్తోంది. ఎస్హెచ్జీ సమూహ్ శక్తి క్యాంపైన్లో భాగంగా ఈ రుణాలు మంజూరు చేస్తోంది. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు ఈ రుణాలు పొందాలంటే… మార్చి 31 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
1992లో ఎస్హెచ్జీ-క్రెడిట్ లింకేజీ ప్రోగ్రామ్ ప్రారంభం కాగా… 2022 అక్టోబర్ 1న ఎస్హెచ్జీ ప్రోగ్రామ్ను ప్రారంభించింది… ఎస్బీఐ. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలపమెంట్-నాబార్డ్ ప్రాజెక్ట్లో భాగంగా మొదలైన ఈ కార్యక్రమంలో ఎస్బీఐ చురుగ్గా పాల్గొంటోంది. ఎస్బీఐ ఎస్హెచ్జీ సమూహ్ శక్తిలో భాగంగా అన్ని జిల్లాల్లోని మహిళా గ్రామీణ బృందాలు 7 శాతం వడ్డీతో రూ.3 లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉంది. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు తీసుకునే గ్రూపులకు… ఒక ఏడాది మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ వర్తిస్తుంది. అదే రూ.5 లక్షలకు పైగా రుణం తీసుకుంటే 9 శాతం వడ్డీ వసూలు చేస్తారు.
స్వయం సహాయక సంఘాలకు రూ.10 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు, మార్జిన్ లేకుండా ఎస్బీఐ రుణాలిస్తోంది. మహిళా గ్రామీణ బృందాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య లోన్ తీసుకుంటే… క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ కవరేజీ కూడా లభిస్తుంది. అయితే రుణాలు మంజూరు చేసేందుకు డిపాజిట్లు చేయాలని ఎస్బీఐ ఎలాంటి ఒత్తిడి చేయదు. 2022 మార్చి 31 నాటికి మొత్తం రూ.24,023 కోట్ల రుణాలను స్వయం సహాయక బృందాలకు ఎస్బీఐ మంజూరు చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇస్తున్న ఎస్హెచ్జీ రుణాల్లో ఎస్బీఐ వాటాయే 25.25 శాతం ఉంది. ఎస్హెచ్జీలకు టర్మ్ లోన్లు, క్యాష్ క్రెడిట్ లిమిట్స్ రెండింటినీ ఇస్తోంది… ఎస్బీఐ.