National Parties in India(Political news telugu):
గతంలో దేశంలో 9 జాతీయ పార్టీలుండేవి. తాజాగా ఈసీ తీసుకున్న నిర్ణయంతో వాటి సంఖ్య ఇప్పుడు ఆరుకు తగ్గింది. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆప్, సీపీఐ(ఎం), ఎన్పీపీ మాత్రమే ఇప్పుడు జాతీయపార్టీలుగా నిలిచాయి. అసలు.. ఈసీ ఏ ప్రాతిపదికన ఒక పార్టీకి రాష్ట్ర హోదా, జాతీయహోదాలను నిర్ణయిస్తుంది? అంటే.. దీనికి చట్టంలో దీనికి కొన్ని లెక్కలున్నాయి. ఆ లెక్కేమిటో మీరూ తెలుసుకోండి.
ప్రతి రాజకీయ పార్టీ దేశస్థాయిలో చక్రం తిప్పాలని తపనపడుతుంది. సమర్థ నాయకత్వం, దేశవ్యాప్త జనామోదంతో బాటు ఈసీ నిర్దేశించిన అర్హతలనూ అందుకున్నప్పుడే జాతీయపార్టీ హోదా దక్కుతుంది. అయితే.. జాతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే.. ముందు అది రాష్ట్ర/ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి.
రాష్ట్ర పార్టీ గుర్తింపు రావాలంటే…
ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు, 2 అసెంబ్లీ సీట్లు గెలవాలి.
లేదా లోక్సభ ఎన్నికల్లో ఒక రాష్ట్రంలో 6 శాతం ఓట్లు, ఒక ఎంపీ సీటు సాధించాలి.
లేదా గతంలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 3 శాతం ఓట్లు లేదా మూడు సీట్లు (ఏది ఎక్కువ అయితే అది)గెలవాల్సి ఉంటుంది.
లేదా అసెంబ్లీ లేదా లోక్సభ ఎన్నికల్లో పార్టీ కనీసం 8 శాతం ఓట్లు పొందాలి.
పై అర్హతలు సాధించిన పార్టీని రాష్ట్రపార్టీగా ఈసీ గుర్తిస్తుంది.
జాతీయపార్టీ కావాలంటే…
పై ప్రమాణాలను అందుకుని, ముందుగా రాష్ట్ర పార్టీ గుర్తింపు పొంది ఉండాలి.
కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీకి.. రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉండాలి
లేదా దేశంలోని కనీసం మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ 2 శాతం చొప్పున ఓట్లు పొందాలి.
లేదా సార్వత్రిక ఎన్నికల్లో(అసెంబ్లీ లేదా లోక్సభ) నాలుగు అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు.. వేర్వేరు రాష్ట్రాల నుంచి కనీసం 4 ఎంపీ సీట్లు సాధించాలి.
ఆప్ ఇక జాతీయపార్టీ…
2012లో అరవింద్ కేజ్రీవాల్ ఆరంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తొలుత ఢిల్లీలో, తర్వాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. అనంతరం జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లోనూ పాల్గొని, గుజరాత్లో 5 సీట్లు, 12 శాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీకి కావాల్సిన అర్హతను అందుకుంది. పార్టీ పెట్టిన పదేళ్లకే ఆప్ ఈ విజయం సాధించటం విశేషం.
హోదా గల్లంతైన పార్టీలు
పై ప్రమాణాలను అందుకోని కారణంగా శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ జాతీయపార్టీ హోదాను కోల్పోయాయి. అయితే.. నాగాలాండ్, మేఘాలయల్లో ఈ రెండు పార్టీలు రాష్ట్రహోదాను పొందగలిగాయి. ఇక.. 1925 నాటి సీపీఐ కూడా జాతీయ హోదాను పోగొట్టుకుంది.
జాతీయ పార్టీ హోదాతో ప్రయోజనాలివే..
దేశవ్యాప్తంగా ఒకే గుర్తుపై పోటీ చేసే అవకాశం వస్తుంది.
సార్వత్రిక ఎన్నికల వేళ.. ఆకాశవాణి, దూరదర్శన్లలో ప్రసారాలకు అవకాశం లభిస్తుంది.
ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర పార్టీలకు 20మంది స్టార్ క్యాంపెయినర్లకు అవకాశం ఉంటే.. జాతీయ పార్టీలు 40మందిని నియమించుకోవచ్చు. వారి ప్రయాణ ఖర్చులు అభ్యర్థుల ఖర్చు కింద పరిగణించరు.
తమ పార్టీ ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వ భూమిని పొందొచ్చు. పార్లమెంటులో మంచి వసతిగల పార్టీ కార్యాలయం కేటాయిస్తారు.
అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే వేళ.. ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుంది.
ఓటరు జాబితా సవరణ వేళ.. రెండు ఓటరు జాబితా సెట్లు ఉచితంగా పొందుతారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒక కాపీని ఉచితంగా పొందే వీలుంటుంది.
రేసులో ఉన్న పార్టీలు..
రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్వాదీపార్టీ, తెలుగుదేశం పార్టీలు కూడా గట్టిగా ఈ హోదా పొందాలని తపనపడుతుండగా, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీ చేసి తానూ ఆ గౌరవాన్ని దక్కించుకోవాలని భారాస ఆశిస్తోంది.