Gnanavapi: జ్ఞానవాపీ కేసులో మరో అప్డేట్. వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మసీదు ప్రాంతంలో శాస్త్రీయ సర్వే చేయాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
వారణాసి కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా.. మసీదు మేనేజ్ మెంట్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. క్రీస్తుశకం 1500 సంవత్సరం నుంచి అక్కడ మసీదు ఉన్నప్పుడు.. ఈ విషయంలో అంత తొందరెందుకని, ఈ అంశంలో స్టేటస్ కో ఉండాలని జ్ఞానవాపి మసీదు కమిటీ సుప్రీంకోర్టులో వాదించింది. దీనిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. ప్రతివాదుల వాదన వినేంత వరకు సర్వైపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సర్వే నిలిపివేయాలని ఆదేశించింది. అంతేకాకుండా.. వారణాసి కోర్టు ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించాలని.. మసీదు మేనేజ్ మెంట్ కమిటీకి సుప్రీంకోర్టు సూచించింది.
జ్ఞానవాపీ మసీదులో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా.. ASI తో శాస్త్రీయ సర్వే చేయించాలని.. గత శుక్రవారం వారణాసి కోర్టు ఆదేశించింది. మసీదు ప్రాంగణంలో ఉన్న దేవతా విగ్రహాలను పూజించేందుకు అనుమతివ్వాలంటూ ఐదుగురు మహిళలు గతేడాది వారణాసి కోర్టును ఆశ్రయించారు. దీనిపై అప్పట్లోనే వీడియోగ్రఫిక్ సర్వేకు అనుమతివ్వడంతో.. శివలింగాకృతి నిర్మాణం వెలుగుచూసింది. అయితే అది ఫౌంటేయిన్ లో భాగమని మసీదు కమిటీ వాదిస్తోంది. దీంతో మరో నలుగురు మహిళలు కోర్టులో మరో వాజ్యం వేశారు. అసలు మసీదు.. అప్పటికే ఉన్న ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మించారా? లేదా? అన్నది తేల్చాలంటూ పిటిషన్ లో కోరారు. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ASIకి ఆదేశాలు జారీ చేసింది. శివలింగాకృతి నిర్మాణం ఉన్న వాజూఖానా మినహా.. మసీదు ప్రాంగనాన్ని శాస్త్రీయ సర్వే చేయించాలని స్పష్టం చేసింది. ఆగస్టు 4వ తేదీలోగా కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది.
వారణాసి కోర్టు ఆదేశాల మేరకు.. సోమవారం ఉదయం ASI కి చెందిన 40 మంది సభ్యులతో కూడిన బృంధం.. మసీదు ప్రాంగణానికి చేరుకుంది. హిందూ ఆలయం ప్రాంగణంలోనే మసీదు నిర్మాణం చేపట్టారా లేదా అన్నదానిపై సర్వే ప్రారంభించారు. ఈ విషయాన్ని వారణాసి జిల్లా కలెక్టర్ కూడా ప్రకటించారు. ఇందుకోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అంతలోనే సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి. ASI సర్వేను నిలిపేయాలంటూ మసీదు కమిటీ సుప్రీంను ఆదేశించడంతో.. వారికి ఊరట కలిగిస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.