Adani: అదానీ కంపెనీ పరువంతా పోయింది. కంపెనీ ప్రతిష్ట మసకబారింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్టుతో కంపెనీ మార్కెట్ కేపిటల్ దారుణంగా పతనమైంది. నెల రోజుల గ్యాప్లో షేర్ వాల్యూ ఏకంగా 60శాతం నష్టం పోయింది. వికీపిడియానూ ఏమార్చారంటూ న్యూస్ వచ్చింది. ఇంటాబయటా అదానీ ఇమేజ్కి భారీ డ్యామేజ్ జరిగింది.
ఇంతలా చేతులు కాలాక.. నష్టనివారణ చర్యలు చేపడుతోంది అదానీ గ్రూప్. కొన్ని రుణాలను ముందస్తుగా చెల్లించింది. కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లబోమని ప్రకటించింది.
ముంద్రాలో ఏర్పాటు చేయాలనుకున్న భారీ ప్లాంట్ నిర్మాణ ప్రణాళికలను ప్రస్తుతానికి పక్కన పెట్టేసింది. అదానీ ఎంటర్ప్రైజెస్ ఎలాంటి కొత్త రోడ్డు ప్రాజెక్టులకు బిడ్లు దాఖలు చేయబోదని తెలిపారు.
అదానీ పోర్ట్స్ అండ్ సెజ్కు ఉన్న 15వందల కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించేసింది. వెయ్యి కోట్లు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్కు.. 500 కోట్లు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్కు తిరిగి ఇచ్చేసింది. తమకు చెల్లించాల్సిన మొత్తాన్ని అదానీ గ్రూప్ చెల్లించేసిందని ఎస్బీఐ ఎంఎఫ్ ప్రకటించింది. ఇక తమకు అదానీ గ్రూప్ ఎలాంటి బకాయి లేదని తెలిపింది.
మరోవైపు, హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై సెబీ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. అదానీ కంపెనీలు తీసుకున్న రుణాలు, జారీ చేసిన సెక్యూరిటీలపై రేటింగ్స్ను తెలియజేయాలని దేశీయ రేటింగ్ సంస్థలను ఆదేశించింది. ఇలా వరుస పరిణామాలతో స్టాక్ మార్కెట్లలో మళ్లీ అదానీ గ్రూప్ షేర్లు ఢమాల్ అన్నాయి. ఒక్కరోజులోనే 50వేల కోట్ల సంపద ఫసక్. అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 10 శాతం లోయర్ సర్క్యూట్ను తాకింది. అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మర్ షేర్లు 5 శాతం నష్టపోయాయి. హిండెన్బర్గ్ నివేదిక తర్వాత జనవరి 25 నుంచి అదానీ షేర్ల పతనం మొదలైంది. ఇప్పటి వరకు దాదాపు 11 లక్షల కోట్లకు పైగా సంపద కరిగిపోయింది.