Ladakh Shepherds : వాస్తవ నియంత్రణ రేఖ (LAC) దగ్గర గొర్రెలను మేపకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన చైనా సైన్యానికి.. లడఖ్ గొర్రెల కాపరుల బృందం ధైర్యంగా ఎదురు నిలబడింది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 2020 గాల్వాన్ ఘర్షణ తర్వాత.. స్థానిక గొర్రెల కాపరులు ఈ ప్రాంతంలో జంతువులను మేపడం మానేశారు. మళ్లీ ఇప్పుడు.. సరిహద్దు ప్రాంతంలో భారత భూభాగం వైపు జీవాలను మేపవద్దని పీఎల్ఏ దళాలు (PLA troops) అభ్యంతరాలు తెలుపగా.. తాము భారత భూభాగంలో ఉన్నామని చెబుతూ చైనా సైనికులతో వాదించారు. మన సైన్యం సహాయంతో చైనా సేనలను వెనక్కి పంపించారు.
లద్దాఖ్ లోని కాక్ జంగ్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను చుషుల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాంజిన్ షేర్ చేయగా.. నెటిజన్లు హృదయాలను ఈ వీడియో గెలుచుకుంది. గొర్రెల కాపరులు చూపిన ప్రతిఘటనను కొంచోక్ స్టాంజిన్ సైతం ప్రశంసించారు. “తూర్పు లడఖ్లోని సరిహద్దు ప్రాంతాలలో @firefurycorps_IA ద్వారా సానుకూల ప్రభావం చూపడం ఆనందంగా ఉంది. గ్రేజియర్లు మరియు సంచార జాతులు పాంగోంగ్ ఉత్తర ఒడ్డున ఉన్న సాంప్రదాయ మేత మైదానాల్లో తమ హక్కులను నొక్కిచెప్పడానికి వీలు కల్పిస్తుంది” అని X లో ఒక పోస్ట్లో ఆయన తెలిపారు. “ఇటువంటి బలమైన పౌర-సైనిక సంబంధాలు & సరిహద్దు ప్రాంత జనాభా ప్రయోజనాలను పరిరక్షించినందుకు నేను #IndianArmy కి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.” అని అదే పోస్ట్ లో ఆయన రాసుకొచ్చారు.
గత మూడేళ్లుగా.. తూర్పు లద్దాఖ్ లోని సంచారజాతులు LAC సమీపంలోని అనేక ప్రాంతాల్లో జంతువులను మేపడం మానేశారు. ఈ ప్రాంతంలో తమకు జంతువులను మేపుకునే హక్కు ఉందని చైనా సైన్యంతో నొక్కి చెప్పిమరీ.. వారిని వెనక్కి వెళ్లేలా చేయడం ఇదే మొదటి సారి. LAC (Line of Actual Control) అనేది భారత్- చైనా దేశాల భూభాగాలను వేరుచేసే ఒక సరిహద్దు రేఖ. భిన్నమైన అవగాహనలు.. ఇరు దేశాల మధ్య వివాదాలకు దారితీశాయి. కొన్ని సందర్భాల్లో హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అలాంటి సందర్భమే ఇప్పుడు ఎదురవ్వగా.. గొర్రెల కాపరులు హింసను నివారించారు.