Koyta Gang : దోపిడీలు చేసేందుకు నేరస్తులు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆయుధాలతో దాడులు చేస్తూ దొంగతనాలు చేస్తున్నారు. ఇంతవరకు చెడ్డీ గ్యాంగ్స్ చేసే నేరాల గురించి విన్నాం. ఇప్పడు కొడవలి గ్యాంగ్స్ కలవర పెడుతున్నాయి.
కొంతకాలంగా మహారాష్ట్రలో కొడవలి గ్యాంగ్స్ హల్ చల్ చేస్తున్నాయి. పుణె పరిసర ప్రాంతాల్లో వేట కొడవళ్లతో జనాలను భయపెడుతున్నాయి. తాజాగా పింప్రీ- చించ్వడ్లో ఓ ముఠా హడలెత్తించింది. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో ఓ మెడికల్ షాప్ లోకి ప్రవేశించారు. దుకాణంలోని సిబ్బందిపై దాడికి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆరుగురు దుండగులు ముఖానికి ముసుగు ధరించి మెడికల్ షాపులోకి ప్రవేశించారు. సిబ్బందిపై దాడికి దిగి విధ్వంసం సృష్టించారు. అంతకుముందు కామ్గార్ నగర్ లోనూ పలు వాహనాలను ధ్వంసం చేశారని పోలీసులు వెల్లడించారు. పుణెలోనూ ఈ దాడులు వెలుగుచూసినట్లు తెలిపారు. మహారాష్ట్రలో గత నాలుగు నెలల వ్యవధిలో 100 కొడవలి గ్యాంగ్ ఘటనలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు.
కొడవళ్లను ఆయుధంగా చేసుకుని జనాలను భయభ్రాంతులకు గురి చేస్తుండటంతో వారిని కొడవలి ముఠాలుగా పిలుస్తున్నారు. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీలోనూ ఈ అంశంపై చర్చ జరిగింది. ఈ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అయినా దాడులు కొనసాగడంతో ప్రజలు భయపడుతున్నారు.