Forda to halt Elective Services in hospitals: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్ కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలి దారుణ హత్యపై రెసిడెంట్ డాక్టర్లు తీవ్రంగా స్పందించారు. సోమవారం దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఫోర్డా(ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ పేర్కొన్నది. ఈ మేరకు ఆ సంఘం తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేడీ నడ్డాకు కూడా లేఖ రాసింది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ వైద్యులకు మద్దతుగా ఈ చర్యను చేపడుతున్నట్లు తెలిపింది.
కాగా, జూనియర్ వైద్యురాలి దారుణహత్యపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఫోర్డా శనివారం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఇందుకు 24 గంటల డైడ్ లైన్ ను కూడా విధించింది. ఈలోగా చర్యలు తీసుకోని యెడల ఆస్పత్రుల్లో సేవలను నిలిపివేస్తామంటూ హెచ్చరించిన విషయం తెలిసిందే. దౌర్జన్యాలకు గురైన తమ వారికి న్యాయం చేయాలని పేర్కొన్నది. దీనికి రాజకీయ రంగు పులిమి ప్రతికూల కోణంలో చూడొద్దంటూ స్పష్టం చేసింది. అన్ని వర్గాలవారు తమ నిరసనకు మద్దతు తెలపాలని కోరింది.
Also Read: కేబినెట్ సెక్రటరీగా టివి సోమనాథన్ నియామకం.. రాజీవ్ గౌబా రిటైర్మెంట్..
అయితే, కోల్ కతాలో ఓ జూనియర్ వైద్యురాలు దారుణ హత్యకు గురయ్యారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెకండీయర్ చదువుతున్న ఆ జూనియర్ డాక్టర్ స్థానిక ప్రభుత్వాసుపత్రిలో గురువారం రాత్రి విధుల్లో ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఆసుపత్రి సెమినార్ హాలులో శవమై కనిపించారు. ఆమె నోరు, కళ్లతోపాటు ఇతర భాగాల నుంచి రక్తస్రావం అయినట్లు పోస్టుమార్టమ్ రిపోర్టులో తేలింది. శరీరంపై వివిధ చోట్ల గాయాలు కూడా కనిపించినట్లు అందులో పేర్కొన్నారు. ఆమెపై హత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టమ్ నివేదిక తేల్చింది. మరోవైపు ఈ కేసులో పోలీసులు ఓ పౌర వాలంటీర్ ను అరెస్ట్ చేశారు. హత్యా స్థలంలో దొరికిన ఓ బ్లూటూత్ ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకుని హంతకుడిగా నిర్ధారించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఆసుపత్రిలో ఉద్యోగుల రక్షణపై ఆందోళన వ్యక్తమవుతున్నది.