Kolkata Doctor Murder| వారం రోజుల క్రితం జరిగిన కోల్ కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. డాక్టర్ మరణించగానే పోలీసులు అమె ఆత్మహత్య చేసుకుందని చెప్పినట్లు ముందుగా వార్తలొచ్చాయి. అది బాగా ప్రచారం జరిగిన తరువాత పోలీసులు తాము అలా ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ఆ తరువాత చనిపోయిన డాక్టర్ పోస్ట్ మార్టెం రిపోర్ట్ లో ఆమె నడుముఎముకలు విరిగిపోయాయని.. ఆమె జననాంగాల్లో 150 గ్రాముల వీర్యం లభించినట్లు.. మీడియా, బిజేపీ పార్టీల నాయకులు ప్రచారం చేశారు. ఇప్పుడిదంతా ఫేక్ న్యూస్ అని పోలీసులు చెబుతున్నారు.
చనిపోయిన డాక్టర్ పోస్ట్ మార్టెం రిపోర్ట్ లో అలాంటి వివరాలేవి లేవని తెలిపారు. ఈ ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన ఇద్దరు డాక్టర్లు, ఒక బిజేపీ నాయకురాలికి ఆదివారం నోటీసులు జారీచేశారు. ఈ ముగ్గురికీ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయడంపై విచారణ చేసేందుకు ఆదివారం మధ్యహ్నం 3 గంటలకు హాజరు కావాలని నోటీసులిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆర్ జి కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్న 31 ఏళ్ల యువతిని ఆగస్టు 9 రాత్రి అత్యాచారం చేసి.. హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు ఒక అనుమానితుడిని అరెస్టు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు సంజయ్ రాయ్ ఒక పోలీస్ ఇన్ఫార్మర్ గా పనిచేస్తుండడంతో ఆ ఆస్పత్రిలో అతను తరుచూ వచ్చేవాడు. గతంలో సంజయ్ రాయ్ అక్కడ పనిచేసే మరో మహిళా డాక్టర్ తో అసభ్యంగా ప్రవర్తించినట్లు కూడా తెలిసింది.
అయితే ఈ అత్యాచారం కేసుపై బిజేపీ, కాంగ్రెస్ ఒకవైపు బెంగాల్ లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు నుంచి రాజకీయాలు చేస్తున్నాయి. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ని ఘటన జరిగిన 24 గంటల్లో ట్రాన్స్ ఫర్ చేయడం. వెంటనే మరో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గా నియామకం చేసేయడంతో బెంగాల్ ప్రభుత్వ తీరు ఈ కేసులో వివాదాస్పదంగా మారింది.
అయితే బెంగాల్ బిజేపీ నాయకులు ఈ కేసులో సంచలన ఆరోపణలు చేశారు. చనిపోయిన డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరిగిందని.. పోస్ట్ మార్టెమ్ రిపోర్ట్ ప్రకారం. ఆమె శరీరంలో 150 గ్రాముల వీర్యం లభించినట్లు ఉందని మీడియా ముందు చెప్పారు. ఇదే విషయం ఇద్దరు డాక్టర్లు కునాల్ సర్కార్, సుబర్ణో గోస్వామి కూడా మీడియా ముందు పలుమార్లు రిపీట్ చేశారు. తాము పోస్ట్ మార్టెం రిపోర్ట్ కళ్లారా చూశామని మీడియాకు తెలిపారు. కానీ ఇప్పుడు పోలీసులు.. పోస్ట్ మార్టెం రిపోర్ట్ లో అలాంటి వివరాలు లేవని చెబుతూ బిజేపీ నాయకురాలు లాకెట్ చటర్జీ , ఇద్దరు డాక్టర్లకు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.
ఈ కేసులో బెంగాల్ కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ కూడా తీవ్రఆరోపణలు చేశారు. నిరసనకారుల ముసుగులో వచ్చిన రౌడీలకు పోలీసులు సహాయం చేశారని.. అలా వచ్చి ఘటనా స్థలాన్ని నాశనం చేశారని చెప్పారు. ప్రస్తుతం మహిళా డాక్టర్ హత్యాచారం కేసుని సిబిఐ అధికారులు విచారణ చేస్తున్నారు.
Also Read: ఫోన్లో ప్రియుడితో మాట్లాడుతుండగా పట్టుబడిన కొత్త పెళ్లికూతురు.. భర్త ఏం చేశాడంటే?