Student organisations demand CM’s resignation: కోల్కతాలో హైటెన్షన్ నెలకొంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ మేరకు సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు మంగళవారం విద్యార్థి సంఘాలు పశ్చిమ్ బంగా చత్ర సమాజ్, సంగ్రామి జౌత మంచ.. ‘నబన్నా అభియాన్’ పేరుతో ర్యాలీలు నిర్వహించాయి.
కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మంగళవారం పశ్చిమ బెంగాల్ సెక్రటేరియట్ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. విద్యార్థుల ర్యాలీని అడ్డుకునేందుకు దాదాపు 6వేల మందికి పైగా పోలీసులు బలగాలు మొహరించాయి. మరోవైపు సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
విద్యార్థి సంఘాలు ‘నబన్నా అభియాన్’ పేరుతో హావ్ డా నుంచి విద్యార్థులు ర్యాలీని ప్రారంభించారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకోవడంతో హావ్ డాలోని సంతర్ గాచి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ ర్యాలీలో ఆందోళనకారులు పాల్గొన్నారు. పోలీసులు వీరిని అడ్డుకునేందుకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే వీటిని ఆందోళనకారులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. కొంతమంది వాటిని దాటుకుంటూ వెళ్లగా.. మరికొంతమంది బారికేడ్లను ధ్వంసం చేశారు. దీంతో పాటు పోలీసులపైకి రాళ్లు విసిరారు.
కోల్కతాలో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులపైకి బాష్పవాయివు ప్రయోగించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కొంతమందిపై లాఠీఛార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అయితే ఆందోళన నిర్వహించేందుకు మాకు అనుమతి కోరుతూ ఎలాంటి అభ్యర్థన రాలేదని పోలీసులు చెబుతున్నారు. అదే విధంగా ర్యాలీ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ర్యాలీలో భాగంగా కొంతమంది హింసకు పాల్పడేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న తరుణంలో నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయిన విద్యార్థులు అర్ధరాత్రి నుంచి కనపడడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే విద్యార్థులు అదృశ్యం అయ్యారని కొంతమంది రాజకీయ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బెంగాల్ పోలీసులు చెబుతున్నారు.
మరోవైపు విద్యార్థులు అదృశ్యం కాలేదన్నది నిజమని పోలీసులు ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ విషయంపై బీజేపీ నేత సువేందు బదులిచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించాయని, మమతా పోలీస్..కోర్టులో కలుద్దామని ఆయన పోస్ట్ చేశారు.
Also Read: మావోలకు దెబ్బ మీద దెబ్బ.. 25 మంది లొంగుబాటు, బలహీనపడుతున్న మావోలు
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలిపై ఆగస్టు 9న హత్యాచారానికి గురైంది. ఈ ఘటనను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా వైద్యులు నిరసనలు వ్యక్తం చేశారు. అయితే తొలుత ఈ ఘటనను తప్పుదోవ పట్టించేందుకు సీఎం మమతా బెనర్జీ ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పరిపాలనలో విఫలమైందని, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.