Kiran kumar Reddy : ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనకు జాతీయస్థాయిలో కీలక పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
మార్చి 12న కాంగ్రెస్ కు కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు.
బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పై కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తీరును తప్పుపట్టారు. ఆ పార్టీ ఎందుకు పతనమైందో తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ తప్పుడు నిర్ణయాల వల్ల ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోయిందన్నారు. పార్టీ పెద్దలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం లేదని తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ కు పవర్ మాత్రమే కావాలని విమర్శించారు.
కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్స్ లేకుండా పోయారని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చేసిన తప్పులేంటో కాంగ్రెస్ కు తెలియడం లేదన్నారు. 1952 నుంచి తన కుటుంబం కాంగ్రెస్ లోనే ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ను వీడతానని తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా డైరెక్షన్ బాగుందని కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. అందుకే బీజేపీలో చేరానని తెలిపారు.