Kerala Government: మలయాళ చిత్రసీమలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చినటువంటి నివేదికపై స్థానికంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖుల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయంటూ ఆర్టిస్టులు ఆరోపించడం తీవ్ర సంచలనం రేపుతోంది. దీనిపై స్పందించిన కేరళ ప్రభుత్వం.. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఓ కమిటినీ ఏర్పాటు చేసింది. మొత్తం ఏడుగురు పోలీస్ ఉన్నతాధికారులతో కూడిన ఈ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం.
Also Read: తెలుగు ఎంతో అద్భుతమైన భాష.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నుంచి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నానంటూ ఓ నటి ఆరోపించారు. ఇదే సమయంలో ప్రముఖ డైరెక్టర్, కేరళ స్టేట్ చలనచిత్ర అకాడమీ అధ్యక్షడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ బెంగాలీ నటి శ్రీలేఖ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో కేరళ స్టేట్ చలనచిత్ర అకాడమీకి చెందిన పలువురు రాజీనామా చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన కేరళ ప్రభుత్వం .. పోలీసు అధికారులతో కూడిన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఇందుకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఐజీ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది.