Kerala Blast : కేరళ ఎర్నాకుళంలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. కలమసేరి కన్వెన్షన్ సెంటర్లో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మందికి తీవ్రగాయాలైనట్లు అధికారులు చెబుతున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సెలవులో ఉన్న వైద్యులతో పాటు, సిబ్బంది వెంటనే హాస్పిటల్కు తిరిగి రావాలని ఆదేశించారు.
కలమసేరి మెడికల్ కాలేజ్, ఎర్నాకుళం జనరల్ హాస్పిటల్, కొట్టాయం మెడికల్ కాలేజీలో అదనపు సౌకర్యాల కోసం ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. బాంబు పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్తో హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఆదివారం ఉదయం కలమస్సేరి సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ప్రేయర్ మీట్ జరుగగా.. ఆ కార్యక్రమానికి వరపుజ, అంగమలి, ఎడపల్లి ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు. ఉదయం 9.20 గంటలకు ప్రార్థన ప్రారంభమవ్వగా.. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ తర్వాత మరో 2-3 చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్షసాక్ష్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో దర్యాప్తుకు..NIA రంగంలోకి దిగింది. పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తముందనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.