Kejriwal’s bail plea: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితులకు కష్టాలు తప్పడం లేదు. ఈ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ రావడంతో తాము బయటపడతామని భావిస్తున్నారు మిగతా నిందితులు. తాజాగా ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్ను సుప్రీంకోర్టు వచ్చేనెల ఐదుకి వాయిదా వేసింది. దీంతో మరికొన్ని రోజులు ఆయన తీహార్ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అరవింద్ కేజ్రీవాల్. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈ పిటీషన్పై విచారణ చేపట్టింది. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ తన వాదనలు వినిపించారు.
ఉద్దేశపూర్వకంగానే సీబీఐ ఆలస్యం చేస్తోందని ఆర్గ్యుమెంట్ చేశారాయన. కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు మరో వారం సమయం కావాలని సీబీఐ విజ్ఞప్తి చేసింది. సీబీఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో ఈ కేసు విచారణను మరో రెండువారాలకు వాయిదా వేసింది.
ALSO READ: బెంగళూరులో భారీ స్కై డెక్..250 మీటర్ల ఎత్తునుంచి నగరాన్ని వీక్షించవచ్చు
లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని సీబీఐ చెబుతోంది. పాలసీ నిర్ణయాలన్నీ కేజ్రీవాల్ అనుమతితోనే జరిగాయని, తీసుకున్న ప్రతీ నిర్ణయం వెనుక ఆయనకు తెలుసని చెబుతోంది. దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని, విచారణను పక్కదోవ పట్టించేందుకు చూస్తున్నారని వెల్లడించింది. ఈడీ కేసులో కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన తీహార్ జైలులో ఉంటున్నారు.