Kejriwal : లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ ప్రశ్నించనుంది. శుక్రవారమే ఆయనకు సమన్లు జారీ అయ్యాయి. విచారణకు హాజరవుతానని కేజ్రీవాల్ కూడా ప్రకటించారు. ఉదయం 11 గంటలకు ఆయన సీబీఐ ప్రధాన కార్యాలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఆ కార్యాలయం వద్ద వెయ్యి మంది పోలీసులను, పారామిలిటరీ బలగాలను మోహరించారు. ఆప్ కార్యాలయం వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.
తాను అవినీతిపరుడినైతే ప్రపంచంలోనే నిష్కళంకులెవరూ ఉండబోరని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. అవినీతిలో నిండా మునిగిపోయిన వ్యక్తి అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆప్ను బీజేపీ లక్ష్యంగా చేసుకుందన్నారు. మొదట సత్యేందర్ జైన్ను, ఆ తర్వాత సిసోడియాను జైలు పంపిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు తనను లక్ష్యంగా చేసుకుందన్నారు. ఎవరిని అరెస్టు చేసినా కేజ్రీవాల్, సిసోడియాల పేర్లు చెప్పాలని దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నాయని ఆరోపించారు.
కోర్టులో తప్పుడు సాక్ష్యాలను చూపినందుకు, దర్యాప్తు పేరిట వేధించినందుకు సీబీఐ, ఈడీలపై కేసులు పెడతామని కేజ్రీవాల్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అధికారాలను దుర్వినియోగం చేసి దర్యాప్తు సంస్థలతో తమ నేతలను వేధిస్తోందని ఆప్ ఆరోపించింది. దేశంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ విమర్శించారు. ప్రతిపక్షాలంతా ఏకమై స్పందించాలని కోరారు. తనకు వ్యతిరేకంగా చేపట్టిన చర్యలకు సరైన సమయంలో కేజ్రీవాల్ సమాధానమిస్తారని బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ అన్నారు. కేజ్రీవాల్కు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు.
సీబీఐ సమన్లు జారీ చేయడంతో కేజ్రీవాల్కు భయం పట్టుకుందని బీజేపీ అంటోంది. నిజంగా భయం లేకుంటే లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధం కావాలని కాషాయ నేతలు సవాల్ చేశారు.కేజ్రీవాలే ఈ కుంభకోణంలో కీలక సూత్రధారని బీజేపీ ఆరోపిస్తోంది. తనకు శిక్ష వేస్తే కోర్టుపైనా కేజ్రీవాల్ కేసు వేస్తారేమోనని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సెటైర్లు వేశారు.