Kedarnath Temple: ఉత్తరాఖండ్ కేదార్నాథ్ ఆలయంలో అవినీతి కలకలం రేపుతోంది. దేవాలయంలోని గోడలకు స్వర్ణతాపడంలో 125 కోట్ల కుంభకోణం జరిగిందని ఆలయ సీనియర్ పూజారి సంతోష్ త్రివేది సంచలన ఆరోపణలు చేశారు.
మహారాష్ట్రకు చెందిన ఓ దాత గర్భగుడిలో స్వర్ణ పలకల తాపడం చేయించారు. అయితే ఆలయ గర్భగుడిలో గోడలను బంగారు రేకులతో కప్పతున్నట్లు చెప్పి, ఇత్తడి పలకలు వాడారని తీవ్ర ఆరోపణలు చేశారు. తీర్థ్ పురోహిత్ మహా పంచాయత్ కు ఉపాధ్యక్షుడిగానూ ఉన్న సంతోష్ త్రివేది ఈ కుంభకోణంలో ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన దిగుతామని హెచ్చరించారు.
బంగారు తాపడం చేయడం సంప్రదాయానికి విరుద్దమని.. ఆలయ నిర్వహణ కమిటీలోనే ఎంతోమంది దీన్ని వ్యతిరేకించారని అన్నారు. బంగారం నాణ్యతపై దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే ఈ ఆరోపణల్ని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించేందుకు రాజకీయ కుట్రలో ఈ ప్రచారం సాగుతోందని ఆరోపించింది. బంగారు తాపడం పనులను ఆర్కియాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. పనులన్నీ దాత చేతుల మీదుగానే జరుగుతున్నాయని.. అందులో ఆలయ కమిటీకి ఎటువంటి జోక్యం లేదని స్పష్టం చేసింది. గతంలో బద్రీనాథ్ ఆలయానికి బంగారు తాపడాన్ని చేయించిన దాతే ప్రస్తుతం దీన్ని తయారుచేయిస్తున్నారని తెలిపింది. కేదార్నాథ్ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆలయ కమిటీ అనుమానం వ్యక్తం చేసింది.