KC Venugopal as PAC Chairman(Today’s news in telugu): రానున్న ఐదేళ్లు కేంద్రంలోని మోదీ సర్కార్కు కష్టాలు తప్పవా? అవుననే సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి. లోక్సభ పక్ష నేత మొదలు కీలక పదవులను కాంగ్రెస్ దక్కించుకుంటోంది. తాజాగా కీలకమైన పీఏసీ ఛైర్మన్ పదవిని సైతం సొంతం చేసుకుంది. దీంతో మోదీ సర్కార్ కష్టాలు తప్ప వని అంటున్నారు నేతలు. అదేంకాదని మోదీ సర్కార్ నిధులు కరెక్టుగానే ఖర్చు చేస్తుందన్నది కమలనాధుల మాట.
పార్లమెంటులో ప్రజాపద్దుల సంఘాన్ని ఏర్పాటు చేస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటన జారీ చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఆద్వర్యంలో సంఘాన్ని ఏర్పాటు చేశారు. లోక్సభ-రాజ్యసభ నుంచి ఈ కమిటీలో 29 మంది సభ్యులుంటారు.
ఇందులో నలుగురు తెలుగు ఎంపీలకు చోటు దక్కింది. వారిలో బీజేపీ నుంచి సీఎం రమేష్, టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, జనసేన ఎంపీ బాలశౌరి, రాజ్యసభ నుంచి డాక్టర్ లక్ష్మణ్కు చోటు దక్కింది. 2024-25 ఏడాదికి ఈ కమిటీ ఆడిట్ నిర్వహించనుంది. ఈ కమిటీ గడువు వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు ఉంది.
ALSO READ: పాదయాత్రకు సిద్ధమవుతున్న మనీశ్ సిసోడియా
ప్రభుత్వ ఆదాయ-వ్యయాలను ఆడిట్ చేస్తుంది ఈ కమిటీ. పద్దతి ప్రకారం ప్రతిపక్షానికి ఈ పదవి వస్తుంది. గడిచిన పదేళ్లలో లోక్సభలో ప్రధాన ప్రతిపక్షం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంగా మారడంతో మోదీ సర్కార్కు ఇబ్బందులు తప్పవని అనుకుంటున్నారు పలువురు ఎంపీలు.
పార్లమెంటు మూడు ఆర్థిక స్టాండింగ్ కమిటీల్లో పీఏసీ కూడా ఒకటి. పార్లమెంటు వివిధ పనులకు విడుదల చేసిన నిధులు సరైన మార్గంలో ఖర్చు చేశారా లేదా అనేదానిపై మానటరింగ్ చేయనుంది. కాగ్ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత ఈ కమిటీ పరిశీలన చేస్తుంది.