Kavitha Judicial Custody Extended to June 3rd: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవితను వర్చువల్ గా రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజ ముందు తీహార్ జైలు అధికారులు హాజరుపరిచారు. ఈడీ, సీబీఐ కేసులో గతంలో కోర్టు విధించిన జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో తీహార్ జైలు అధికారులు కవితను మరోసారి రౌస్ ఎవిన్యూ కోర్ట్ లో హాజరుపరిచారు. న్యాయమూర్తి కవిత జ్యుడీషియల్ కస్టడీని మరో 15 రోజులు పొడిగించారు. జూన్ 3 వరకూ కవిత తీహార్ జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. కాగా.. ఈ నెల 24న బెయిల్ పిటిషన్ విచారణ ఉంది.
ఈ ఏడాది మార్చి 15 న హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసి, అదే రోజు ఢిల్లీకి తరలించారు. మర్చి 16న కవితను కోర్టు ముందు హాజరుపరిచారు. లిక్కర్ కేసులో కవిత పాత్రపై ఈడీ కోర్టులో తన వాదనలు వినిపించింది. కవిత నేతృత్వంలోనే సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్లు ఆప్ కీలక నేతలకు చేరాయని ఆరోపించింది. ఈ సమాచారం రాబట్టేందుకు కస్టడీ ఇవ్వాలని కోర్టును కోరింది.
Also Read: తెలంగాణ కేబినెట్ భేటీకి అనుమతి ఇచ్చిన ఈసీ
తర్వాత రెండు సార్లు 10 రోజులకు కవిత ఈడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. మార్చి 26 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కవిత తీహార్ జైలులో కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం మూడు రోజుల కస్డడీ తర్వాత ఆమెను తిరిగి కోర్టులో హాజరుపరచగా కోర్టు సీబీఐ కేసులోనూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం రెండు కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది.