Karnataka Job Reservation: ఉద్యోగాల్లో రిజర్వేషన్ విధానాలపై ఇప్పిటికే పలు చోట్లు వివాదాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ కోసం మనోజ్ జారంగ్ పాటిల్ ఇప్పటికే నిరాహార దీక్షపై ఉన్నారు. మరోవైపు బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కర్ణాటక ప్రభుత్వం.. రాష్ట్రంలో స్థానికులకే 70 శాతం నుంచి వంద శాతం (కొన్ని పదవులు) ఉద్యోగాలు రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇప్పటికే ప్రకటించారు.
గత సోమవారం రాష్ట్ర కేబినెట్ స్థానికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంశంపై నిర్ణయం తీసుకుందని.. త్వరలోనే రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టే అవకాశమందని కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలిపారు.
Also Read: ముంబై ఎయిర్ పోర్టులో నిరుద్యోగుల తొక్కిసలాట.. 2వేల పోస్టులకు 25వేలమందికి పైగా హాజరు
ఈ బిల్లు.. అసెంబ్లీలో గురువారం ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో అమోదం పొందిన తరువాత చట్టంగా మారితే.. స్థానికులు అంటే కన్నడ భాష మాట్లాడే కన్నడిగులకు ప్రైవేటు కంపెనీల్లో 70 శాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పించడం తప్పనిసరిగా మారుతుంది.
కన్నడిగ లేదా కర్ణాటక స్థానికులకు నిర్వచనం
కర్ణాటక ఉద్యోగ రిజర్వేషన్ బిల్లు 2024 ప్రకారం.. రాష్ట్రంలో ఓ వ్యక్తి 15 ఏళ్లకు పైగా నివసిస్తూ ఉండాలి. ఆ వ్యక్తి కన్నడ భాష అనర్గళంగా మాట్లాడం, వ్రాయడం తెలిసి ఉండాలి. పదో తరగతిలో అతను కన్నడ భాష చదివి ఉండాలి. లేదా ప్రభుత్వం పెట్టే కన్నడ భాష పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.
ఈ ఉద్యోగ రిజర్వేషన్ బిల్లు నియమాల ప్రకారం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16ను అనుసరించి ప్రైవేటు సంస్థల్లో 50 శాతం మేనేజ్ మెంట్ జాబ్స్, 70 శాతం ఇతర ఉద్యోగాల్లో కన్నడిగులకు రిజర్వేషన్ కల్పించాలి. కేటగిరి -సి, కేటగిరి – డి లో వంద శాతం కన్నడిగులకే ఉద్యోగాలు కల్పించాలి. ఈ చట్టాన్ని ప్రైవేటు కంపెనీలు మూడు సంవత్సరాల లోపు అమలు పరచాలి. ఉద్యోగాల కోసం అర్హులైన కన్నడిగులు లభించకపోతే.. స్థానికులకు శిక్షణ ఇవ్వాలి. లేకుంటే కనీసం 25 శాతం కన్నడిగు మేనేజ్ మెంట్ పదవుల్లో, 50 శాతం ఇతర ఉద్యోగాల్లో సంస్థలో పనిచేస్తూ ఉండాలి.
ఈ నియమాలను ఉల్లంఘిస్తే.. కంపెనీలకు లేబర్ డిపార్ట్ మెంట్ రూ.10000 నుంచి రూ.25000 వరకు ఫైన్ విధించి.. తదుపరి గడువు ఇస్తుంది. ఒకవేళ ఆ తరువాత కూడా ప్రైవేట్ కంపెనీలు నియమాలు పాఠించకపోతే రోజుకు రూ.100 రూపాయలు ఫైన్ కట్టాలి.
స్థానికులు ఉద్యోగాల విషయంలో ఫిర్యాదు చేస్తే.. ఆరు నెలల లోపు కోర్టులో కేసు విచారణ ప్రారంభమవుతుంది.