ముందు కర్ణాటక సీఎం సిద్ద రామయ్యకు గవర్నర్ గెహ్లాట్ నోటీసులు ఎందుకు జారీ చేశారో తెలుసుకుందాం.. మైసూర్ నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ ఇళ్ల స్థలాల కేటాయింపులో అవినీతి జరిగిందనేది ఆరోపణ. సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు వారసత్వంగా వచ్చిన భూములు తీసుకొని వేరే చోట భూములు ఇచ్చింది ముడా.. అయితే స్వాధీనం చేసుకున్న భూముల కంటే.. ఇచ్చిన భూముల విలువే ఎక్కువ ఉందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు ఓ ఆర్టీఐ యాక్టివిస్ట్.. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. అయితే సిద్ధరామయ్య విచారణకు హాజరు కావాలంటూ నోటీసులిచ్చారు గవర్నర్.. ఇది షాక్కు గురి చేసింది అందరిని. ఓ యాక్టివిస్ట్ సీఎంపై ఫిర్యాదు చేస్తే గవర్నర్ ఇంత ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వడం ఏంటి? విచారణకు రావాలని పిలవడమేంటి? అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
అయితే సీఎం సిద్ధరామయ్యతో పాటు.. ఆయన క్యాబినెట్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. గవర్నర్ సీఎంకు నోటీసులు జారీ చేయడమేంటని ప్రశ్నించింది. అంతేకాదు గవర్నర్ జారీ చేసిన నోటీసులను వెంటనే వాపస్ తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇది కచ్చితంగా రాజకీయ ప్రేరేపిత కుట్రే అంటూ ఆరోపణుల చేసింది సిద్ధ రామయ్య గవర్నమెంట్.. నిజానికి కర్ణాటక గవర్నర్ గెహ్లాట్ చర్య మరోసారి గవర్నర్ల పెత్తనంపై చర్చకు తెర లేపింది. అయితే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండాలి. లేదంటే గవర్నర్లు లేదా లెఫ్టినెంట్ గవర్నర్లతో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుందా? అనే డౌట్స్ వస్తున్నాయి. నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆమోదంతోనే అధికారంలోకి వస్తాయి.
మరి అలాంటి ప్రభుత్వాలపై గవర్నర్ల పెత్తనం ఏంటన్నది చాలా ఏళ్లుగా ఉన్న ప్రశ్న.. మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్లు పని చేయాలి కానీ.. కానీ ప్రస్తుతం కొందరు గవర్నర్లు కేంద్రం డైరెక్షన్లోనో.. లేదా కేంద్ర పెద్దల మెప్పు కోసం స్థానిక ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ తీసుకొండి. అక్కడి సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద బోస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నిత్యం ఏదో ఒక వివాదం వీరి ఇరువురి మధ్య నడుస్తూనే ఉంటుంది. అయితే మాటలు.. లేదంటే కేసులు.. అది కూడా దాటితే ఏకంగా కోర్టుకెక్కుతుంటారు. దీనంతటికి కారణం.. వీరిరువురు ఒకే పార్టీకి చెందిన వారు కాకపోవడం. అఫ్కోర్స్ పార్టీలకు.. గవర్నర్ పదవులకు డైరెక్ట్గా సంబంధం ఉండదు. కానీ నిజమేంటో అందరికి తెలిసిందే.
Also Read: శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత
ఢిల్లీకి సంబంధించి ఎల్జీలు, ప్రభుత్వం మధ్య అనేక గొడవలు చూశాం..కోర్టులు జోక్యం చేసుకున్న సందర్భాలు అనేకం.. ఇక తమిళనాడులోనూ ఇదే పరిస్థితి. అధికార డీఎంకేకు, గవర్నర్కు మధ్య అనేక విబేధాలు.. తమిళనాడులో అయితే గవర్నర్ దిష్టిబొమ్మలను సైతం తగులబెట్టారు. గవర్నర్ చర్యలకు వ్యతిరేకంగా ఏకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. కేరళలో కూడా LDF ప్రభుత్వానికి గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మధ్య అనేక వివాదాలు. తెలంగాణలో కూడా ఇలాంటి రచ్చ మనం చూశాం. జార్ఖండ్, చత్తీస్గఢ్, మహారాష్ట్రలోనూ ఇలాంటి పంచాయతీలు అనేకం.
అన్నింటిని అబ్జర్వ్ చేస్తే.. విపక్ష పార్టీల ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఈ పంచాయతీలు కామన్గా మారాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల కంటే తామే శక్తివంతులమనేలా గవర్నర్ల వ్యవహారశైలి నడుస్తోందన్న ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అయితే చాలా కాలంగా ఈ విబేధాలు ఉన్నా కానీ.. లెటెస్ట్గా మాత్రం ఈ వ్యవహార ధోరణి పెరగడం అనేది కాస్త ఆందోళన కలిగిస్తోంది. నిజానికి గవర్నర్ అంటే కేంద్ర, రాష్ట్రాల మధ్య వారధిగా ఉండాల్సిన వారు. కానీ రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన రాజ్భవన్లు రాజకీయాలకు అడ్డాగా మారుతున్నాయన్న ఆరోపణలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు ఒక సమస్యతో వ్యవహరించే సమయంలో.. తమ మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నా కానీ శత్రు వైఖరి అనేది ఉండొద్దు.. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం అలా కనిపించడం లేదు. దీనికి సిద్ధరామయ్య ఎపిసోడే లెటెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. మరి గవర్నర్ మంత్రివర్గ తీర్మానాన్ని ఆమోదించి వెనక్కి తగ్గుతారా? లేదంటే తగ్గేదేలే అని ముందుకెళ్తారా? అనేది చూడాలి.