Karnataka Elections : కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వార్ పతాక స్థాయికి చేరింది. రాష్ట్రంలో ఎన్నికలకు వారం మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార , ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరుపార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేశాయి. పోటా పోటీగా హామీలు గుప్పించాయి. బీజేపీ ముస్లింల రిజర్వేన్లను రద్దు చేస్తామని ప్రకటించడంతో వివాదం మొదలైంది. భజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో ఎన్నికల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.
భజరంగ్దళ్ నిషేధంపై కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ప్రజల మధ్య విభజన తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. విశ్వహిందూ పరిషత్ యువజన విభాగమైన భజరంగ్దళ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోందని పేర్కొంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. బీజేపీ విజయం ఖాయమని తేలడంతో కాంగ్రెస్ కుయుక్తులకు పాల్పడుతోందని బీజేపీ విమర్శించింది. మరోవైపు కాంగ్రెస్ పై భజరంగ్ దళ్ మండిపడింది. కాంగ్రెస్ మేనిఫెస్టోకు భజరంగ్ దళ కార్యకర్తలు నిప్పు పెట్టి నిరసన తెలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్లపై చర్య తీసుకోవాలని అజయ్ మాకెన్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. బీజేపీ నేతలు విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించింది.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో సంయమనం పాటించాలని రాజకీయ పార్టీలకు ఈసీ సూచించింది. కొందరు నేతలు వాడుతున్న భాషను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. ఎన్నికల ప్రవర్తన నియమావళికి అన్ని పార్టీలూ కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.