Karnataka CM Siddaramaiah: ఆంధ్రప్రదేశ్ మినహా దక్షిణ భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం అన్యాయమని.. కర్ణాటక ప్రజల ఓట్లతో ఎన్నికల్లో గెలిచిన నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా మోసం చేశారని.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
మంగళవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తన పదవిని కాపాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్, బీహార్లకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చారని.. అయితే కర్ణాటక నుంచి ఎన్నికల్లో గెలిచి పార్లమెంటుకు వెళ్లిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని సిద్ధరామయ్య ఆరోపణలు చేశారు.
“కర్ణాటక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కోరిన నిధులు లేవు.. కనీసం నిర్మలా సీతారామన్ చేసిన హామీల ప్రస్తావన అసలే లేదు. కల్యాణ కర్ణాటక కోసం కేవలం రూ.5000 కోట్లు అడిగాం.. కానీ ఆ మాత్రం నిధులు కూడా కర్ణాటక కోసం కేటాయించలేదు. ఈ బడ్జెట్ లో రైతులకు పెద్ద మోసం జరిగింది. అయిదేళ్ల నుంచి రైతులు అడుగుతున్న కనీస మద్దతు ధర చట్టం బడ్జెట్ లో ప్రస్తావిచలేదు. ఫిబ్రవరి నెలలో సమర్పించిన బడ్జెట్ లో ఐటి రంగం అభివృద్ధి కోసం 1.37 లక్షల కోట్లు కేటాయించారు.. ఇప్పుడు దాన్ని 1.16 లక్షల కోట్లకు తగ్గించారు.
అంతే కాదు.. విద్య, వైద్యం, రక్షణ రంగాలకు ఫిబ్రవరి కేటాయించిన బడ్జెట్ ని భారీగా తగ్గించేశారు. పెరిఫెరల్ రోడ్డు, అప్పర్ భద్ర ప్రాజెక్టు కోసం గతంలో ప్రకటించిన నిధులు ఇంతవరకు ఆర్థిక మంత్రి ఇవ్వలేదు. పైగా ఎస్ సీ, ఎస్ టీ నిధుల కేటాయింపులు భారీగా తగ్గించేశారు. ఇది వెనుకబడిన వర్గాల కేంద్రం చేసిన ద్రోహం. బడ్జెట్ కు ముందు నిర్మలా సీతారామన్ మమల్ని మీటింగ్ కోసం పిలిచారు. ఇప్పుడు బడ్జెట్ చూస్తే.. ఆ మీటింగ్ లకు అసలు అర్థం లేదు.
కేంద్రంలో అయిదుగురు కర్ణాటక మంత్రలున్నా.. రాష్ట్రానికి బడ్జెట్ లో అన్యాయం జరిగింది. ఈ మంత్రులందరూ విఫలమైనట్లే..,” అని సిద్దరామయ్య బడ్జెట్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Also Read: కింగ్ మేకర్లను ప్రసన్నం చేసుకున్న కేంద్రం.. బడ్జెట్లో ఏపీ, బిహార్కు వరాలు
బడ్జెట్ లో కర్ణాటకకు జరిగిన అన్యాయానికి నిరసనగా జూలై 27న జరిగే నీతిఆయోగ్ మీటింగ్ ను బహిష్కరిస్తున్నట్లు సిద్దరామయ్య ట్వీట్ చేశారు.