Kamal Hasan : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఉత్సాహంగా సాగుతోంది. భారీ సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాహుల్ వెంట నడుస్తున్నారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాదయాత్రలో సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఈ యాత్రలో ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ పాల్గొననున్నారు. డిసెంబర్ 24న ఈ యాత్రలో రాహుల్ తో కలిసి నడుస్తారు. రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకు వచ్చే వారంలో కమల్ హాసన్ ఈ యాత్రలో పాల్గొంటారని మక్కల్ నీది మయ్యం పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం రాజస్థాన్లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర డిసెంబర్ 24న దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశిస్తుంది. ఎనిమిది రోజుల విరామం తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర్ప్రదేశ్, హరియాణాలో కొనసాగించనున్నారు. చివరగా జమ్మూకశ్మీర్లోకి ప్రవేశించడానికి ముందు వచ్చే నెలలో రాహుల్ పంజాబ్లో యాత్ర చేయనున్నారు.
సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. తమిళనాడుతోపాటు కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో పాదయాత్ర పూర్తైంది. ప్రస్తుతం రాజస్థాన్లో కొనసాగుతోంది. వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి కశ్మీర్ చేరుకోనుంది.