Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వం భారీ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న మొత్తం 40,889 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం నుంచే ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 16వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. దరఖాస్తు రుసుము రూ. 100గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్లోని తప్పులను సరిదిద్దుకునేందుకు ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు అవకాశం ఇచ్చారు. ఎటువంటి పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా పదో తరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
ఎంపికైన బీపీఎం ఉద్యోగులకు జీతం రూ 12 వేల నుంచి గరిష్ఠంగా రూ. 29,380.. ఏబీపీఎం, డాక్ సేవక్ ఉద్యోగులకు రూ. 10 వేల నుంచి గరిష్ఠంగా రూ. 24,470 మధ్య చెల్లించనున్నారు.
ఇక తెలంగాణలో 1266, ఆంధ్రప్రదేశ్లో 2480 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తపాళాశాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు పదో తరగతి వరకు తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా చదివి ఉండాలని పేర్కొంది. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలని, కంప్యూటర్ పరిజ్ఞాణంతో పాటు సైకిల్ తొక్కడం రావాలని వెల్లడించింది.