Zomato: ట్విట్టర్, ఫేస్ బుక్, అమెజాన్, సిస్కా.. ఇంటర్నేషనల్ కంపెనీలేనా.. మేముసైతం అంటూ దేశీయ జొమాటో కూడా ఉద్యోగులపై వేటు వేస్తోంది. 3 శాతం ఎంప్లాయిస్ ను ఉద్యోగాల నుంచి తీసేయాలని నిర్ణయించింది. కోత.. ఏరివేత.. ఇప్పటికే మొదటుపెట్టేసింది.
అందరు చెబుతున్న మాట ఒకటే. నష్టాలు తగ్గించుకోవడం. ఖర్చులు కట్ చేయడం. అందుకు, కంపెనీలన్నీ పింక్ స్లిప్స్ నే నమ్ముకుంటున్నాయి. ఎలాన్ మస్క్ అయితే ట్విట్టర్ ను చేజిక్కించుకున్న రోజే పెద్ద సంఖ్యలో ఎంప్లాయిస్ ను సాగనంపేశాడు. మెటా, అమెజాన్, సిస్కా సైతం వేలల్లో ఉద్యోగులను తొలగించింది. ఇండియాలో పరిస్థితి కాస్త బెటర్ అనుకుంటుండగానే.. జొమాటో సైతం జాబులు కట్ చేయడం కలకలం రేపుతోంది.
ఇప్పటికే వివిధ విభాగాలకు చెందిన దాదాపు 100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్టు జొమాటో వర్గాలు తెలిపాయి. ఏటా చేపట్టే పనితీరు ఆధారిత మదింపులో భాగంగానే 3 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించాయి. ప్రస్తుతం జొమాటోలో 3,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఖర్చులు తగ్గించుకోవడానికే ఉద్యోగుల సంఖ్య తగ్గించుకుంటున్నట్టు తెలిపింది.
గతంలో కరోనా సమయంలో దాదాపు 500 మందికి పైగా ఉద్యోగులను తొలగించగా.. మళ్లీ ఇప్పుడు వేటు మొదలెట్టింది.