Jitendra Awhad | కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తి భావంతో కొలుచుకునే శ్రీరాముడు మాంసాహారి అంటూ ఎన్సీపీ నేత డాక్టర్ జితేంద్ర అవహద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాముడు అన్ని వర్గాల ప్రజలకు చెందినవాడని.. వేటాడటం, జంతువులను తినడం శ్రీ రాముడు చేసేవాడని ఆయన అన్నారు.
Jitendra Awhad | కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తి భావంతో కొలుచుకునే శ్రీరాముడు మాంసాహారి అంటూ ఎన్సీపీ నేత డాక్టర్ జితేంద్ర అవహద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాముడు అన్ని వర్గాల ప్రజలకు చెందినవాడని.. వేటాడటం, జంతువులను తినడం శ్రీ రాముడు చేసేవాడని ఆయన అన్నారు. రాముడిని చూపించి బీజేపీ నేతలంతా అందరినీ శాకాహారులుగా మార్చాలనుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అక్కడితో ఆగలేదు 14 ఏళ్లు అడవుల్లో గడిపిన రాముడు శాకాహారం ఎక్కడి నుంచి తెచ్చుకోగలరని చెప్పారు. గురువారం మహారాష్ట్రలోని షిర్డీలో ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎన్సీపీ నేత ఈ వ్యాఖ్యలు చేశారు.
జనవరి 22 అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఆ రోజున డ్రై డేగా ప్రకటించి మద్యం, మాంసాహారంపై నిషేధం విధించాలని బిజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఛత్తీస్ గడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే జనవరి 22న డ్రై డే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఎన్సీపీ నేత జీతేంద్ర ఈ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది.
ముంబైలోని జితేంద్ర నివాసం వద్ద హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, ఆయన నివాసం వద్ద పోలీసులు బందోబస్తును పెంచారు.
మరోవైపు అయోధ్య పురోహితుడు పరమహన్స్ ఆచార్య.. ఎన్సీపీ నేత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జితేంద్ర అవహద్పై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఆయనను చంపేస్తానని చెప్పారు. భగవంతుడు శ్రీ రాముడి మర్యాదకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసేవారికి జీవించే అధికారం లేదని మండిపడ్డారు.
ఆందోళనలు పెరగడంతో జీతెంద్ర దిగొచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ కోరారు. ఏ విషయంపైనా పరిజ్ఞానం పెంచుకోకుండా మాట్లాడవద్దన్న రామాయణ సూత్రాన్ని ఆయన గుర్తు చేశారు. తాను రిసెర్చ్ చేసే మాట్లాడానని.. కానీ తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని ఆయన కోరారు. తనతో వాదించలేని వారే కేసులు పెడతామని బెదిరిస్తున్నారంటూ బీజేపీ నేతలకు కౌంటర్ వేశారు.