Champai Soren Oath (current news from India):
ఝార్ఖండ్ లో కొత్త సర్కార్ కొలువుదీరింది. కొత్త సీఎంగా జేఎంఎం సీనియర్ నేత చంపయీ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. సీఎంతోపాటు మరో ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసారు. కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలం, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తాకు మంత్రులుగా స్థానం దక్కింది. ఇక చంపయీ సోరెన్ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోనుంది.
జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనను ఈడీ అరెస్టు చేసింది. సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. జనవరి 31న హేమంత్ను ఈడీ ఆఫీసర్స్ సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆ వెంటనే ఆయన సీఎం పదవికి రిజైన్ చేశారు. ఆ తర్వాత హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుపైనా ఉత్కంఠ ఏర్పడింది. ఆఖరికి చంపయీ సోరెన్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గసుగమైంది. గురువారం అర్ధరాత్రి గవర్నర్ సర్కార్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 10 రోజుల్లోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ స్పష్టంచేశారు. ఝార్ఖండ్ అసెంబ్లీ 81 మంది ఎమ్మెల్యేలున్నారు.
జేఎంఎం కూటమికి 48 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.
బలపరీక్ష నేపథ్యంలో జేఎంఎం నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించే ఏర్పాట్లు చేసింది.