Jharkhand Floor Test Updates : ఝార్ఖండ్లో చంపయీ సోరెన్ ప్రభుత్వం బలనిరూపించుకుంది. బలపరీక్షలో సీఎం చంపయీ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్ విజయం సాధించింది. మొత్తం అసెంబ్లీలో 81 మంది ఎమ్మెల్యేలున్నారు. అందులో 47 మంది చంపయీ సోరెన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. 29 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఈ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత సీఎం చంపయీ సోరెన్, మాజీ సీఎం హేమంత్ సోరెన్ బీజేపీపై విమర్శలు గుప్పించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ యత్నించిందని సీఎం చంపయీ సోరెన్ అన్నారు. హేమంత్ సోరెన్పై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. తాను హేమంత్ కు పార్ట్-2 అని చంపయీ తనను తాను వర్ణయించుకున్నారు.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ సీఎం సీఎం హేమంత్ సోరెన్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆయన బల నిరూపణ పరీక్షలో పాల్గొనేందుకు కోర్టు అనుమతించింది. ఈ క్రమంలోనే తమ కస్టడీలో ఉన్న హేమంత్ సోరెన్ ఈడీ అధికారులు అసెంబ్లీకి తీసుకొచ్చారు. బలపరీక్షలో మాజీ సీఎం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే అసెంబ్లీ ప్రశంగం కూడా చేశారు.
జనవరి 31 రాత్రి.. దేశంలో ఓ సీఎం అరెస్టయ్యారని హేమంత్ మండిపడ్డారు. దాని వెనక రాజ్భవన్ జోక్యం ఉందని తాను నమ్ముతున్నానని తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై ఉన్న ఆరోపణలను ఈడీ నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. చంపయీ సోరెన్ పూర్తి మద్దతు ఉందని స్పష్టం చేశారు. కానీ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాతే హేమంత్ ను అరెస్ట్ చేశారు.