Javeria-Sameer Love Story: ఇటీవల కాలంలో దేశాలను, ఖండాలను దాటి మరీ ప్రేమ పెళ్లిళ్ళు చేసుకొని వైరల్ గా మారిన స్టోరీలను చూస్తున్నాం. ఇక ఇప్పుడు చూడబోయే ఈ స్టోరీలో సినిమా కథ లెవెల్లో ట్విస్ట్ లు కూడా ఉండడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పాకిస్థాన్ కి చెందిన అమ్మాయి.. భారత్ అబ్బాయి ప్రేమించుకోవడం.. వారి లవ్ స్టోరీకి కోవిడ్ కూడా ఒక విలన్ కావడం.. మొత్తానికి ఇప్పుడు ఐదేళ్ల తర్వాత వారు పెళ్లి పీఠలు ఎక్కబోతుండడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 2018లో ఈ ప్రేమకథ మొదలవ్వగా.. 2024 లో పెళ్లితో ఒకటి కాబోతున్న వీరిద్దరి లవ్ స్టోరీ ట్రెండింగ్ గా మారింది.
కోల్కతాకు చెందిన సమీర్ఖాన్ జర్మనీలో చదువుకున్నాడు. అయిదేళ్ల కిందట భారత్కు వచ్చినప్పుడు తన తల్లి ఫోనులో కరాచీకి చెందిన జావెరియా ఖానుమ్ ఫొటో చూసి మనసు పారేసుకున్నాడు. పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకుంటానని పట్టుబట్టాడు. తన ప్రేమ విషయాన్ని అమ్మాయి తరపు వారికి కూడా చెప్పి ఒప్పించాడు. ఇక వారిద్దరి పెళ్ళికి పెద్దలు అంగీకరించారు. కానీ.. అప్పుడే ఊహించని బ్రేక్ పడింది. భారత్కు వచ్చేందుకు జావెరియా రెండుసార్లు ప్రయత్నించగా ఆమె వీసా తిరస్కరణకు గురైంది. ఇక ఆ తర్వాత వచ్చిన కొవిడ్ కూడా దేశం దాటడానికి అడ్డంకిగా మారి.. వారి ప్రేమకు విలనైంది.
రీసెంట్ గా పంజాబ్లోని ఖాడియాన్కు చెందిన సామాజిక కార్యకర్త మక్బూల్ అహ్మద్ ఖాదియన్ సహకారంతో 45 రోజుల గడువుతో జావెరియాకు భారత్ వీసా దక్కింది. దాంతో ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. దాంతో మంగళవారం నాడు జావెరియా వాఘా-అట్టారీ అంతర్జాతీయ సరిహద్దు నుండి భారతదేశానికి చేరుకుంది. కాబోయే కోడలికి భర్త సమీర్ ఖాన్, అతని కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. భారత్ రావడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఇక్కడకు వచ్చిన వెంటనే చాలా ప్రేమ, ఆప్యాయతలు లభిస్తున్నాయని ఖానుమ్ చెప్పింది. పాకిస్థాన్లోని తన ఇంటి వద్ద అందరూ చాలా సంతోషంగా ఉన్నారని.. ఐదేళ్ల తర్వాత వీసా మంజూరు కావడాన్ని నమ్మలేకపోతున్నానని పేర్కొంది. త్వరలోనే దీర్ఘకాలిక వీసా కోరుతూ భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తానని జవేరియా వెల్లడించింది. జావెరియాకు వీసా మంజూరు చేసినందుకు భారత ప్రభుత్వానికి సమీర్ఖాన్ కృతజ్ఞతలు తెలిపాడు.