Jammu Kashmir Records Highest Voter Turnout: పార్లమెంటు ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన కీలక విషయాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో జమ్మూకాశ్మీర్ లో గత 35 ఏళ్లలో అత్యధికంగా పోలింగ్ నమోదు అయ్యిందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఐదు లోక్ సభ స్థానాల్లో కలిపి 58.46 శాతం ఓట్లు పోలయ్యాయని పేర్కొంది. 2019 తో పోలిస్తే కశ్మీర్ లోయలో 30 శాతం ఓటింగ్ పెరిగినట్లు తెలిపింది. అదేవిధంగా అభ్యర్థుల సంఖ్యలో కూడా 25 శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది. ఓటర్ల నుంచి ఈ స్థాయిలో మద్దతు లభించడాన్ని చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సానుకూల పరిణామంగా కనిపిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ అన్నారు.
కశ్మీర్ లోయలోని 3 స్థానాల్లో కలిపి మొత్తం 50.86 శాతం ఓటింగ్ నమోదు కావడాన్ని చూస్తుంటే ప్రజాస్వామ్య ప్రక్రియపై స్థానిక ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నదని సీఈసీ తెలిపింది. అయితే.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 19.16 శాతం ఓట్లు నమోదు అయ్యిందని, ఈసారి మాత్రం 30 శాతం ఓటింగ్ పెరిగినట్లు వెల్లడించింది. కశ్మీర్ లోయలోని శ్రీనగర్ లో 38.49, అనంత్ నాగ్-రాజౌరీలో 54.84 శాతం, బారాముల్లాలో 59.1 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ మూడు ప్రాంతాల్లో గత మూడు దశాబ్దాల్లో నమోదైన ఓట్లను బట్టి పోల్చి చూస్తే ఇవే అత్యధికం. ఇక.. జమ్మూలో 72.22 శాతం, జమ్మూ ప్రాంతంలోని ఉధంపూర్ లో 68.27 శాతం పోలింగ్ నమోదైంది.
Also Read: ఆ రోజు సిట్ ముందు హాజరవుతా : ప్రజ్వల్ రేవణ్ణ
జమ్మూకాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను అతి త్వరలోనే ప్రారంభిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ శనివారం పేర్కొన్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30 లోగా ఇక్కడ శాసన సభ ఎన్నికలు నిర్వహించాలని గత సంవత్సరం ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత జరగనున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కానున్నాయి. ఇక్కడ నియోజకవర్గాల పునర్విభజన అనంతరం శాసనసభ స్థానాల సంఖ్య 83 నుంచి 90కి పెరిగింది.