Maldives Row : భారత్-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం నడుస్తున్న వేళ.. విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించారు. భారత దేశానికి ప్రతిసారి అన్ని దేశాల మద్దతు ఉంటుందని హామీ ఇవ్వలేమని ఆయన వ్యాఖ్యానించారు.
Maldives Row : భారత్-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం నడుస్తున్న వేళ.. విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించారు. భారత దేశానికి ప్రతిసారి అన్ని దేశాల మద్దతు ఉంటుందని హామీ ఇవ్వలేమని ఆయన వ్యాఖ్యానించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, లక్షద్వీప్పై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలతో మనదేశం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది కాస్తా రెండు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలకు దారితీసింది. దీనిపై జైశంకర్ను ప్రశ్నించగా..రాజకీయాలను రాజకీయాల్లాగే చూడాలన్నారు. ప్రతి దేశమూ ప్రతిరోజూ మన అభిప్రాయాలతో ఏకీభవిస్తుందని నేను గ్యారంటీ ఇవ్వలేనని ఆయన స్పష్టం చేశారు. గత పది సంవత్సరాలుగా ఈ ప్రపంచంతో భారత్ను అనుసంధానించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఎన్నో విజయాలు సాధించామని జైశంకర్ తెలిపారు.
ఇతర దేశాలతో స్నేహ పూర్వక సంబంధాల కోసం భారత్ చేస్తోన్న ప్రయత్నాల గురించి జై శంకర్ మాట్లాడారు. రాజకీయ సంబంధాల్లో హెచ్చుతగ్గులు ఉండడం సహజమన్నారు. సాధారణంగా ఆయా దేశ ప్రజలు భారత్పట్ల సానుకూల భావాలనే కలిగి ఉంటారన్నారు. భారత్తో సత్సంబంధాల ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారని జై శంకర్ చెప్పారు.
ఇదిలా ఉండగా.. భారత్ మాల్దీవుల మద్య ఈ విభేదాలు నడుస్తోన్న తరుణంలోనే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు చైనాలో పర్యటించారు. స్వదేశానికి వచ్చిన తర్వాత తమది భౌగోళికంగా చిన్నదేశమే.. కానీ బెదిరించడం తగదని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు చైనా మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నా గట్టిగా వ్యతిరేకిస్తామని ప్రకటించింది.
ఈ పరిణామాల మధ్యే తమ దేశంలో ఉన్న సైనిక దళాలను మార్చి 15లోగా ఉపసంహరించుకోవాలని మన దేశాన్ని ముయిజ్జు కోరిన సంగతి తెలిసిందే. మాల్దీవుల్లో 88 మంది భారత్ సైనికులు విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం.