Youtubers are facing IT Rides : సోషల్ మీడియా అనేది అందరి జీవితాల్లో ముఖ్య పాత్ర పోషించడం మొదలుపెట్టిన తర్వాత ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎలా ఫేమస్ అవుతున్నారో తెలియడం లేదు. అలా వీడియోలు విడుదల చేసి, ఫేమ్ సంపాదించుకొని సినిమాల వరకు వెళ్లిన వారు కూడా ఉన్నారు. కొందరు ఇదే విధంగా డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు. అలా యూట్యూబ్ లాంటి యాప్తో బాగా సంపాదిస్తున్నారు అని అనుమానం వచ్చిన కంటెంట్ క్రియేటర్స్ ఇళ్లల్లో తాజాగా ఐటీ దాడులు కలకలం సృష్టించాయి.
యూట్యూబ్ అనేది ఎంతోమందికి ఉపాధి కలిపించింది. రెండు, మూడు వీడియోలు తీసి అవి క్లిక్ అయితే.. సబ్స్క్రైబర్లు పెరుగుతారు. సబ్స్క్రైబర్లు పెరిగితే.. వీడియోలకు వ్యూస్, షేర్స్ పెరుగుతాయి. దాన్ని బట్టి వారికి తగిన పేమెంట్ లభిస్తుంది. ఇలా క్రియేటివ్ కంటెంట్ మాత్రమే కాదు.. కామెడీ, గేమింగ్, టూరింగ్.. ఇలా పలు కేటగిరిలకు సంబంధించిన వీడియోలు చేస్తూ రెండు చేతుల నిండా డబ్బు సంపాదించుకునే యూట్యూబర్లు కూడా ఉన్నారు. అంతే కాకుండా ఏదైనా బిజినెస్ను ప్రమోట్ చేయాలంటే సినీ యాక్టర్ల రేంజ్లో కోరికలు కోరుతున్నారు.
ఇలా సంపాదిస్తున్నారు కాబట్టే కేరళలోని కొందరు యూట్యూబర్లు సంవత్సరానికి దాదాపు రూ.1 కోటి నుండి 2 కోట్లు ఆదాయం వెనకేస్తున్నారని ఐటీకి సమాచారం అందింది. అందుకే అలప్పురా, త్రిసూర్, ఎర్నాకూలమ్, పాలక్కాడ్.. వంటి ప్రాంతాల్లో ఉన్న యూట్యూబర్ల ఇళ్లల్లో ఐటీ దాడులు నిర్వహించారు. డిజిటల్ కంటెంట్తో డబ్బులు సంపాదిస్తున్న యూట్యూబర్లు.. ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుంటున్నారో లేదో తెలుసుకోవడమే ఈ రైడ్ యొక్క ముఖ్య లక్ష్యమని అధికారులు తెలిపారు.
ఈ రైడ్ల వల్ల పలువురు యూట్యూబర్ల ఆదాయం గురించి, పన్ను గురించి కీలక సమాచారం బయటపడుతుందని అధికారులు నమ్ముతున్నారు. అంతే కాకుండా వారు తీసుకుంటున్న చర్యలు చూసి ఇతర యూట్యూబర్లు కూడా ట్యాక్స్ కట్టడంపై శ్రద్ధ వహించాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ రైడ్లపై మరింత సమాచారం ఏమీ బయటికి రాలేదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేసినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.