ISRO : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) ఈ ఏడాదంతా బిజీ బిజీ. సగటున నెలకు ఒకటి చొప్పున 12 అంతరిక్ష యాత్రలు చేపట్టనుంది. 2024లో తొలి రోజునే ఓ ఉపగ్రహాన్ని ఇస్రో పంపింది. కాస్మిక్ ఎక్స్ కిరణాల మిస్టరీని ఛేదించే లక్షంతో ఆ ప్రయోగం చేపట్టింది. ఇక ఈ ఏడాదిలో 3 రోజుల గగన్యాన్ మిషన్కు సన్నద్ధత ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సి ఉంది. భారత్ చేపట్టబోతున్న తొలి మానవ సహిత రోదసి యాత్ర ఇదే. ముగ్గురు వ్యోమగాములను భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలోకి గగన్యాన్ స్పేస్క్రాఫ్ట్ను ప్రవేశపెట్టనుంది.
గగన్యాన్ కన్నా ముందే.. అంటే 2025లో చేపట్టే మానవరహిత అంతరిక్ష యాత్రకూ ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. ఇవన్నీ ఈ ఏడాదిలోనే పూర్తి చేసుకోవాలి. ఇక హ్యుమనాయిడ్ రోబో వ్యోమిత్ర టెస్ట్ ఫ్లయిట్లు చేపట్టాల్సింది కూడా ఈ ఏడాదే. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ఆసియాలో మన దేశానికి చైనా నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. 2030 కల్లా చంద్రుడిపై కాలు మోపాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పోటీకి తగ్గట్టుగానే నిరుడు ఇస్రో రికార్డు స్థాయిలో 7 ప్రయోగాలు చేపట్టింది.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 క్రాఫ్ట్ విజయవంతంగా దిగడం వీటిలో ఒకటి. ఈ ఘనత సాధించిన తొలి దేశం మనదే. ఆ తర్వాత కొన్నాళ్లకే ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 కూడా సక్సెస్ఫుల్గా గమ్యాన్ని చేరింది. ఈ నెల 6వ తేదీన సూర్యుడి లంగ్రాజ్ పాయింట్-1కి దానిని సురక్షితంగా చేర్చగలిగారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ఏడాది 12 నెలల కాలంలో కనీసం 12 మిషన్లను చేపట్టాల్సి ఉంటుందని ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ వెల్లడించారు. భారత్ మొత్తం 424 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపగా.. వాటిలో 389 ఉపగ్రహాలు గత 9 ఏళ్ల కాలంలో ప్రయోగించినవే.