ISRO : ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ-డీ2 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ ఉపగ్రహ ప్రయోగం చేపట్టారు. వేకువజామున 2.48 గంటలకు కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ 6.30 గంటలపాటు కొనసాగింది. అనంతరం 9.18 గంటలకు షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎస్ఎస్ఎల్వీ-డీ2 నింగిలోకి దూసుకెళ్లింది. 3 ఉపగ్రహాలను ఎస్ఎస్ఎల్వీ-డీ2 రాకెట్ కక్ష్యలోని ప్రవేశపెట్టింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. కేవలం 15 నిమిషాల్లో ప్రయోగం పూర్తైంది.
ఎస్ఎస్ఎల్వీ-డీ2 ద్వారా ఇస్రోకు చెందిన 156.3 కిలోల బరువుగల ఈవోఎస్-07 ఉపగ్రహంతోపాటు యూఎస్ఏ అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జానెస్-1, చెన్నై స్పేస్ కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల బాలికలు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీ శాట్-2ను నింగిలోకి పంపించారు. ఈ 3 ఉపగ్రహాలను రాకెట్ భూసమీప కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 450 కిలోమీటర్ల ఎత్తులో 785 సెకన్ల వ్యవధిలో ఈవోఎస్-07, 880 సెకన్లకు జానెస్-1, చివరగా 900 సెకన్లకు ఆజాదీ శాట్ను కక్ష్యలో ప్రవేశపెట్టంది. దీంతో ప్రయోగం విజయవంతమైంది.
ఇది షార్ నుంచి చేపట్టిన 84వ ప్రయోగం. ఎస్ఎస్ఎల్వీ–డి సిరీస్లో రెండోది. ఎస్ఎస్ఎల్వీ–డీ1 పేరుతో గత ఏడాదిలో చేసిన మొదటి ప్రయోగం విఫలమైంది. ఇప్పుడు ఎస్ఎస్ఎల్వీ డీ2 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు.