ISIS conspiracy case: ఐసిస్ కుట్రకేసుకు సంబంధించి శనివారం తెల్లవారుజాము నుండి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఏకకాలంలో 44 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర, కర్ణాటక సహా నిర్వహించిన ఈ దాడుల్లో 13 మందిని అరెస్ట్ చేసింది. ఐసిస్ కుట్ర కేసులో భాగంగా మహారాష్ట్రలోని పుణె, ఠాణె, మీరా భయాందర్ తో సహా పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ ఈ సోదాలు చేపట్టింది. మరోవైపు కర్ణాటకలో కూడా దాడులు కొనసాగుతున్నాయి. పుణెలో 2 ప్రాంతాల్లో, ఠాణెలో 40 ప్రాంతాల్లో, కర్ణాటకలో మరో రెండు ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
పుణె ఐసిస్ మాడ్యుల్ కేసులో కీలక నిందితుడైన షానవాజ్ ను ఢిల్లీలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతని నుంచి ఐఈడీలను తయారు చేసేందుకు ఉపయోగించే పలు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని పట్టుకునేందుకు ఎన్ఐఏ అధికారులు ఆపరేషన్ చేపట్టారు. గత నెలలో ఏడుగురిని అరెస్ట్ చేసి.. ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులు ఉగ్రముఠాలను ఏర్పాటు చేసి.. నిధులను సేకరిస్తున్నారని పేర్కొంది. వారి నుంచి మారణాయుధాలు, ఐఈడీ, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.