ఈశా ఫౌండేషన్ పేరు వినగానే.. మనందరి కళ్లకు కనిపించే విజువలే వేరు. యోగా, ఆధ్యాత్మికత, శివనామస్మరణ, మహా శివరాత్రి నాడు జాగరణ.. ఇలా చాలానే గుర్తొస్తాయ్. కానీ.. అప్పుడప్పుడు సద్గురు జగ్గీ వాసుదేవ్పైనా, ఆయన నడిపే ఈశా ఫౌండేషన్పైనా వచ్చే ఆరోపణలు మాత్రం.. అనేక అనుమానాలకు తావిస్తున్నాయ్. బయట జరుగుతున్న ప్రచారానికి.. ఈశా ఫౌండేషన్ చెబుతున్న దానికి.. అస్సలు పొంతనే ఉండటం లేదు. దాంతో.. అసలు.. ఆశ్రమంలో ఏం జరుగుతోందనే చర్చ ఇప్పుడు మొదలైంది.
భారతదేశంలో ఆశ్రమాలకు, యోగా సెంటర్లకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు ఉన్న స్థానమే వేరు. కానీ.. కొన్ని కొన్ని సార్లు వీటి ముసుగులో కొందరు చేసే దారుణాలు కూడా ఎన్నో సార్లు హెడ్ లైన్స్గా మారాయ్. అవన్నీ పక్కనబెడితే.. ప్రతి ఆశ్రమం దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. అందులో.. జగ్గీ వాసుదేవ్ నడుపుతున్న ఈశా ఫౌండేషన్ కూడా ఒకటి. ఇందులో.. ప్రధానంగా యోగా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఎవరైనా సరే.. ఇక్కడికి వెళ్లొచ్చు. బస చేయొచ్చు. యోగాతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఇక్కడ.. వేలాది మందికి ఈశా యోగా సెంటర్ వసతి కల్పిస్తోంది. ఇందులో.. సన్యాసం స్వీకరించిన వాళ్లూ ఉన్నారు. మానసిక ప్రశాంతత కోసం వెళ్లిన వారూ ఉన్నారు. సన్యాసం తీసుకోవాలా? వద్దా? అనేది.. పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిందని ఈశా ఫౌండేషన్ చెబుతోంది. కానీ.. ఆశ్రమాల్లో ఎంతో కొంత బ్రెయిన్ వాష్ చేస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దాని వల్లే.. వేలాది మంది యువతీ, యువకులు ఈశా ఫౌండేషన్కు వెళ్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది. ఈశా ఫౌండేషన్లో లైఫ్ టైమ్ వాలంటీర్గా ఉండే అవకాశం కూడా కల్పిస్తున్నారు.
Also Read: ఈషా ఫౌండేషన్లో పోలీసుల సోదాలు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
బయటకి అంతా బగానే కనిపిస్తున్నా.. ఆ మధ్య ఓ మహిళ.. సద్గురు ఆశ్రమంలోనే చనిపోయింది. అంతేకాదు.. సద్గురు ఆశ్రమం నుంచి గతంలో కొందరు అమ్మాయిలు కూడా మిస్ అయ్యారనే ఆరోపణలున్నాయి. సద్గురు ఆశ్రమంలోకి వాలంటీర్గా వెళితే.. వాళ్లను అక్కడే ఉంచే విధంగా చేస్తారనే టాక్ కూడా ఉంది. అంతేకాదు.. నెమ్మదిగా వాళ్ల కుటుంబాలకు కూడా దూరం చేస్తారనే ఆరోపణలున్నాయి. తల్లిదండ్రులతో ఫోన్లు మాట్లాడకుండా, వారిని కలవకుండా చేస్తుంటారని.. అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్లు కొందరు చెప్పారు. పేరుకు.. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని ప్రచారం చేస్తున్నా.. ఆశ్రమంలో జరిగే వ్యవహారం అంతా వేరేలా ఉంటుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇక్కడికి వచ్చే వాళ్లలో విదేశీయులే ఎక్కువగా ఉంటున్నారు. పైగా.. ఇక్కడ ఉండే కోర్సులు కూడా చాలా కాస్లీ. వారానికింత.. నెలకింత.. అని బాగానే డబ్బులు దండుకుంటున్నారనే విమర్శలున్నాయ్. అంతేకాదు.. వాలంటీర్గా ఉండాలన్నా కూడా ఓ కోర్సు చేయాల్సి ఉంటుంది. మానసికంగా కాస్త బలహీనంగా ఉన్నోళ్లను ఈజీగా ట్రాప్ చేస్తారనే చర్చ కూడా ఉంది. అలాంటి వాళ్లనే ముందుగా టార్గెట్ చేసి.. బ్రెయిన్ వాష్ చేసి.. తమ వైపునకు మళ్లించుకుంటారు. అంతేకాదు.. ఒక్కసారి ఈశా ఫౌండేషన్ యోగా సెంటర్కి వెళితే.. అదో అడిక్షన్లా మారిపోతుందని చెబుతున్నారు. వెళ్లినవాళ్లు పదే పదే అక్కడికి వచ్చేలా మానసికంగా వాళ్లను సిద్ధం చేస్తున్నారనే టాక్ కూడా ఉంది.
తాజాగా.. రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజ్ ఆరోపణలను చూస్తే.. నిజంగానే.. జగ్గీ వాసుదేవ్.. అమ్మాయిలు ఈశా ఫౌండేషన్ ఆశ్రమం వదిలి వెళ్లకుండా బ్రెయిన్ వాష్ చేస్తున్నారేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఆరోపణలను, అనుమానాలన్నింటిని తేల్చాలని.. మద్రాస్ హైకోర్టు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. అతి త్వరలోనే.. ఈశా ఫౌండేషన్కు సంబంధించిన వాస్తవాలు బయటకొచ్చే అవకాశాలున్నాయి.