Isha Foundation : తమిళనాడులోని కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ ద్వారా జగ్గీ వాసుదేవ్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ సుపరిచితమయ్యారు. అయితే ఆయన నిర్వహిస్తున్న ఈషా ఫౌండేషన్ పై మద్రాస్ హైకోర్టులో కేసు నమోదైంది. దీంతో కేసు దేశ సర్వోన్నత న్యాయస్థానం వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే విచారించిన సుప్రీం, జగ్గీకి పెద్ద ఊరటనిచ్చింది.
సుప్రీం కొట్టివేత…
సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్వహిస్తున్న ఈషా ఫౌండేషన్పై మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తమ కూతుళ్లను ఇషా ఫౌండేషన్లో బ్రెయిన్ వాష్ చేసి సన్యాసం వైపు మళ్లించారన్న అభియోగాలతో ఓ తండ్రి, ప్రొఫెసర్ దాఖలు చేసిన కేసు విచారణ రద్దు చేసింది సుప్రీం. ఇదే సమయంలో తీర్పు సైతం వెలువరించింది.
గీత, లత మేజర్లు…
ఇక ఈ కేసులో మద్రాస్ హైకోర్టు అనుచితంగా ప్రవర్తించినట్లు సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. గీత (42) లత (39) ఇద్దరు మహిళలు మేజర్లు అని, వారి ఇష్టప్రకారమే ఆశ్రమంలో నివసిస్తున్నారని సుప్రీం ప్రస్తావించింది. దీంతో ఈ పిటిషన్ చట్టవిరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
అసలు కేసు ఏంటి ?
పిటిషనర్ కూతుర్లలో ఒకరు వీడియో మోడ్ ద్వారా సుప్రీం కోర్టుకు విచారణకు హాజరయ్యారు. ‘నేను, నా సోదరి స్వచ్ఛందంగానే తమకు ఇష్టపూర్వకంగానే ఈషా ఫౌండేషన్లో నివసిస్తున్నామని విచారణలో భాగంగా ధర్మాసనానికి వివరించారు. ఇందులో మాపై ఎవరి ఒత్తిడి లేదా బలవంతం లేదన్నారు. తమ తండ్రి ఎనిమిదేళ్లుగా తమను వేధిస్తున్నాడని కోర్టుకు చెప్పుకున్నారు.
గతంలో తమిళనాడుకు చెందిన విశ్రాంత ప్రొఫెసర్ తమ కూతుర్లు కనిపించడం లేదంటూ మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ దాఖలు చేశారు. దీంతో మద్రాస్ హైకోర్టు ఈషా ఫౌండేషన్పై విచారణ చేపట్టింది.
ఆశ్రమం అందుకే వెళ్లారు, మళ్లీ రాలేదు…
ఆయన కుమార్తెలు గీత, లత ఈషా యోగా కేంద్రంలో యోగా నేర్చుకునేందుకు వెళ్లి మళ్లీ వెనక్కి రాకుండా అక్కడే ఉండిపోయారని కోర్టుకు చెప్పారు. ఈశా ఫౌండేషన్ లో వారికి అక్కడి సిబ్బంది బ్రెయిన్ వాష్ చేసి సన్యాసం పుచ్చుకునేలా చేశారని కోర్టుకు వివరించారు. తమ ఇద్దరు కుమార్తెలను ఫౌండేషన్ నుంచి కాపాడాలని, వాళ్లను తనకు అప్పగించాలని ఆయన కోరారు. దీంతో హైకోర్టు విచారణ చేపడుతూ నివేదిక దాఖలు చేయాలని తమిళనాడు పోలీసులకు అదేశాలు జారీ చేసింది.
స్వచ్ఛందంగానే అక్కడున్నారు…
మరోవైపు గీత, లత తండ్రి ఆరోపణలను ఈషా ఫౌండేషన్ ఖండించింది. తాము ఎవరినీ పెళ్లి చేసుకోమని లేదా సన్యాసం తీసుకోమని బలవంతం చేయలేదని, సలహాలు సైతం ఇవ్వలేదన్నారు. ఎవరికి వారు ఇక్కడ స్వచ్ఛందంగా తమ జీవితాలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. ఈ నేపథ్యంలో యోగా కేంద్రం సుప్రీంను ఆశ్రయించింది.
సుప్రీం స్టే…
ఫౌండేషన్పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. ఇదే సమయంలో తమిళనాడు పోలీసుల స్టేటస్ రిపోర్టును తమకు సమర్పించాలని చెప్పింది. దీంతో ఇద్దరు మహిళలు స్వచ్ఛందంగానే ఆశ్రమంలో నివసిస్తున్నారని, సుప్రీం ధర్మాసనానికి పోలీసులు నివేదిక సమర్పించారు. ఈ మేరకు కేసును డీవై చంద్రచూడ్ ధర్మాసనం కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
Also Read : నాలుగు నెలల్లో ఇది రెండోసారి… మళ్లీ రష్యాకు ప్రధాని మోదీ, స్వయంగా ఆహ్వానించిన అధ్యక్షుడు పుతిన్