Corona: ఇండియాలో కరోనా కొత్త వేరియంట్. ఒమిక్రాన్ బీఎఫ్ 7. ఇప్పటికే చైనాను వణికిస్తోంది. మన దగ్గరా ఎంట్రీ ఇచ్చింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి. మాస్కులు మస్ట్. మందులు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్ బెడ్స్ చెక్ చేసుకోవాలి. ఇలా కేంద్ర ప్రభుత్వం కరోనాపై ఫుల్ అలర్ట్ ప్రకటించింది. హాస్పిటల్స్ లో ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తున్నారు.
కేంద్రం అయితే హడావుడి చేస్తోంది కానీ.. జనాల్లోనే ఇంకా సీరియస్ నెస్ రాలేదు. వ్యాక్సిన్ తీసుకున్నాంగా.. మనకేం కాదులే అనే భ్రమలో ఉన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా.. కొత్త వేరియంట్ సోకుతుందనే విషయం వారికి తెలుసో లేదో. కేసులేవి? మునుపటిలా ఆసుపత్రుల్లో చేరికలేవి? ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు కొందరు.
విదేశీ ప్రయాణికులకు ఎయిర్పోర్టుల్లో పరీక్షలు చేస్తున్నారు. గత 2 రోజుల్లో 6వేల మందికి పరీక్షలు చేయగా.. వారిలో 39 మంది ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది.
చైనా, కొరియా, జపాన్, హాంకాంగ్ దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులకు ఎయిర్పోర్టుల్లో కరోనా పరీక్షలు తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. మిగతా దేశాల నుంచి వచ్చే విమానాల్లో 2 శాతం మందికి రాండమ్గా కొవిడ్ టెస్టులు చేయాలని ఆదేశించింది. దీంతో, రెండు రోజుల్లోనే 39 మంది ప్యాసింజర్లకు పాజిటివ్ అని తేలడంతో కలవరం మొదలైంది. వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. వారికి సోకింది ఒమిక్రాన్ బీఎఫ్ 7 అని తేలితే.. మరింత డేంజర్ సిగ్నల్స్ మోగినట్టే.
జనవరిలో దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరిగే అవకాశముందనేది నిపుణులు అంచనా. వచ్చే 40 రోజులు కీలకమని తెలుస్తోంది. ‘‘గతంలో తూర్పు ఆసియాలో కొవిడ్ కొత్త వేవ్ మొదలైన దాదాపు 30-35 రోజుల తర్వాత భారత్లోనూ వైరస్ వ్యాప్తి మొదలవ్వడం గుర్తించాం. ఆ ట్రెండ్ను గమనిస్తే జనవరిలో దేశవ్యాప్తంగా కేసులు పెరగొచ్చు’’ అని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు అంటున్నాయి.
అయితే, ఈ సారి కరోనా వైరస్ తీవ్రతగా తక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. కొత్త వేవ్ వచ్చినా.. కొవిడ్ మరణాలు, ఆసుపత్రుల్లో చేరికలు చాలా తక్కువే ఉంటాయని అంటున్నారు. చైనా మాదిరి కల్లోలం మన దగ్గర ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. భయపడాల్సిన అవసరం లేకున్నా.. జాగ్రత్తగా ఉండాలని గట్టిగా సూచిస్తోంది కేంద్రం.