Iron Rods on Trailway Track: రైలు పట్టాలపై ఏదొక భారీ వస్తువులను ఉంచి.. రైలు ప్రమాదాలను సృష్టించేందుకు కొందరు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. గడిచిన నెలరోజుల వ్యవధిలో ఇలాంటి ఘటనలు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు జరిగాయి. వాటిని అధికారులు ముందే గుర్తించడంతో చాలా రైలు ప్రమాదాలు తగ్గాయి. తాజాగా పంజాబ్ లో అలాంటి ఘటనే వెలుగుచూసింది. భటిండాలో రైల్వే ట్రాక్ పై ఇనుప రాడ్ లు కనిపించడంతో.. అధికారులు అప్రమత్తమయ్యాయి. ఆ మార్గంలో వచ్చే రైళ్లకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో పెనుప్రమాదం తృటిలో తప్పినట్లైంది. ఈ ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భటిండా – ఢిల్లీ రైల్వే ట్రాక్ లైన్లో వెళ్తున్న గూడ్స్ రైలు లోకో పైలట్ ట్రాక్ పై ఇనుప రాడ్లు ఉండటాన్ని గుర్తించి, అప్రమత్తమయ్యాడు. పట్టాలపై ఐరన్ రాడ్స్ పెట్టడంతో రైలుకు సిగ్నల్ అందలేదు. ఫలితంగా అది చేరాల్సిన సమయం ఆలస్యమైంది. దీనిపై ప్రభుత్వ రైల్వే పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ శవీందర్ కుమార్ మాట్లాడుతూ.. ఎవరో దుర్మార్గులు చేసిన కుట్రనా ? లేక ఆకతాయిల చేష్టలా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: మరో రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. అరె ఏమైంది రా.. ఇలా చేస్తున్నారు!
ఇప్పటి వరకూ 9 ఇనుపరాడ్లను స్వాధీనం చేసుకున్నామని, ఒక వ్యక్తిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. సెప్టెంబర్ 22న.. అనగా నిన్న ఇదే ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. కాన్పూర్ జిల్లాలోని పెరంబూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై ఎల్పీజీ సిలిండర్ ఉంచడాన్ని గూడ్స్ ట్రైన్ లోకో పైలట్ గుర్తించి.. సకాలంలో రైలును ఆపివేయడంతో పెనుప్రమాదం తప్పింది. ఆగస్టు నుంచి సెప్టెంబర్ 10 వరకూ ఇలాంటి ఘటనలు 18 జరుగగా.. జూన్ 2023 నుంచి ఇప్పటి వరకూ ట్రాక్ లపై సిలిండర్లు, సైకిళ్లు, ఇనుపరాడ్లు, సిమెంట్ దిమ్మలు వంటి వాటిని ఉంచి ప్రమాదాలకు కుట్ర చేసిన ఘటనలు 24 జరిగాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. వీటి 15 ఘటనలు ఈ ఏడాది ఆగస్టులోనే జరిగాయని తెలిపారు.
దారిదోపిడీ దొంగలు సరుకులను దొంగిలించేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారా ? లేక దీనివెనుక మరో కుట్ర కోణం ఏమైనా ఉందా ? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.