RIP Sitaram Yechury: తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడైన సీతారాం ఏచూరి అనారోగ్యంతో కన్నుమూశారు. సీపీఐ(ఎం) పార్టీ జనరల్ సెక్రెటరీ ఏచూరి తెలుగు చక్కగా మాట్లాడేవారు. మద్రాస్లో పుట్టినా.. పదో తరగతి వరకు హైదరాబాద్లోనే చదువుకున్నారు. లెఫ్టిస్ట్ భావజాలానికి కీలక కేంద్రంగా చాలా మంది భావించే ఢిల్లీలోని జేఎన్యూలోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ఏచూరి ప్రారంభించారు. జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. అనతి కాలంలోనే సీపీఐ(ఎం) పార్టీలోనే ఉన్నత స్థానాలకు ఎదిగారు. విద్యార్థి దశ నుంచి తుదిశ్వాస విడిచే వరకూ కమ్యూనిస్టుగానే కొనసాగినా.. నమ్మిన సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటించిన సీతారాం ఏచూరి ప్రస్థానం గురించి తెలుసుకుందాం.
వ్యక్తిగత వివరాలు:
సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12వ తేదీన మద్రాస్లో జన్మించారు. ఏపీలోని కాకినాడకు చెందిన సర్వేశ్వర సోమయాజుల ఏచూరి, కల్పకం ఏచూరిలకు జన్మించారు. సీతారాం ఏచూరి తండ్రి ఏపీఎస్ఆర్టీసీలో ఇంజినీర్గా, తల్లి గవర్నమెంట్ ఆఫీస్గా పని చేశారు. మద్రాస్లో జన్మించినప్పటికీ సీతారాం ఏచూరి హైదరాబాద్లోనే పెరిగారు. పదో తరగతి వరకు హైదరాబాద్లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్లో చదువుకున్నారు. 1969 తెలంగాణ ఉద్యమం ఆయనను ఢిల్లీకి తీసుకెళ్లింది. ఢిల్లీలో హైయర్ సెకండరీ పాస్ అ్యారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎకనామిక్స్లో బీఏ ఆనర్స్, జేఎన్యూలో ఎంఏ ఎకనామిక్స్ చదివారు. జేఎన్యూలోనే పీహెచ్డీ చేస్తుండగా ఎమర్జెన్సీ వచ్చింది. ఆ సమయంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన సీతారాం ఏచూరి అరెస్టయ్యాడు. పీహెచ్డీ పరిశోధన ఆగిపోయింది.
రాజకీయ ప్రస్థానం:
1974లో సీతారాం ఏచూరి సీపీఐ(ఎం) పార్టీ విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐలో చేరారు. జేఎన్యూ స్టూడెంట్గానే 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. కొన్నాళ్లు అండర్గ్రౌండ్ కూడా వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. 1977-78 కాలంలో జేఎన్యూ స్టూడెంట్ యూనియన్కు మూడు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జేఎన్యూలో వామపక్ష భావజలం బలపడటానికి సీతారాం ఏచూరి, ప్రకాశ్ కరత్లది కీలక పాత్ర.
2005 నుంచి 2015 వరకు సీపీఐ(ఎం) పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ప్రకాశ్ కరత్ తర్వాత.. సీతారాం ఏచూరి ఈ బాధ్యతలు తీసుకున్నారు. మొత్తం మూడు సార్లు ఆయన సీపీఐ(ఎం) పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. లెఫ్ట్ పార్టీల్లో అధ్యక్షుడి కంటే కూడా ప్రధాన కార్యదర్శికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనేది తెలిసిందే.
Also Read: Sitaram Yechury: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
ఇందిరా గాంధీకి అల్టిమేటం:
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి సీతారాం ఏచూరి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆసక్తికర ఘటన జరిగింది. ఎమర్జెన్సీ ముగిశాక.. జేఎన్యూ చాన్సిలర్గా ఉన్న ఇందిరా గాంధీ రాజీనామా చేయాలని సీతారం ఏచూరి డైరెక్ట్గా డిమాండ్ చేశారు. ఆమె ఎదుటే ఆయన డిమాండ్ను నిర్భయంగా వెల్లడించారు. రెండు రోజుల తర్వాత మరో 500 మంది విద్యార్థులతో కలిసి ఇందిరా గాంధీ నివాసానికి మార్చ్ చేపట్టారు. ఆ తర్వాత ఇందిరా గాంధీ రాజీనామా చేశారు.
ఓ యూట్యూబర్కు సీతారాం ఏచూరి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు పంచుకున్నారు. ఎమర్జెన్సీ అమల్లో ఉండగా.. జేఎన్యూలో కోర్టు మీటింగ్ కోసం ఇందిరా గాంధీ వస్తున్నదని తమకు తెలిసిందని వివరించారు. ఆ యూనివర్సిటీ హైలెవెల్ బాడీగా ఈ కోర్టు ఉండేది. అప్పుడు జేఎన్యూకు చాన్సిలర్గా ప్రధాని ఉండేవారు. ఆ కాలంలో ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ జేఎన్యూకు చాన్సిలర్ హోదాలో కోర్టు మీటింగ్ కోసం రావాల్సి ఉన్నది. అప్పటికే జేఎన్యూలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా విద్యార్థులు తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేస్తున్నారు. అప్పుడు సీతారం ఏచూరి సోషల్ సైన్సెస్ కన్వీనర్గా ఉన్నారు. ఇందిరా గాంధీ యూనివర్సిటీకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎమర్జెన్సీ వంటి అప్రజాస్వామిక చర్యలు చేపట్టిన ఇందిరా గాంధీ ఈ యూనివర్సిటీలోకి రావడానికి వీల్లేదని నినాదాలు చేశారు.
విద్యార్థులను కట్టడి చేయడానికి పోలీసులు రంగప్రవేశం చేశారు. అప్పుడు జేఎన్యూలో ఒక గర్ల్స్ హాస్టల్, రెండు బాయ్స్ హాస్టల్ ఉండేవని, పోలీసులు కన్ఫ్యూజన్లో గర్ల్స్ హాస్టల్ను బాయ్స్ హాస్టల్ అనుకుని చుట్టూ చేరి బయటికి రాకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఇందిరా గాంధీ వర్సిటీలోకి వస్తుండగా.. తాను ఒక పోలీసు అధికారిని పట్టుకుని విద్యార్థుల మధ్యకు తీసుకెళ్లి.. అరెస్టులు చేసిన తమ విద్యార్థులను విడిచిపెడితే ఆ పోలీసు అధికారిని విడిచిపెడుతామని డిమాండ్ చేసినట్టు వివరించారు.
Also Read: Soundarya: బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసిన సౌందర్య.. అలాంటి పాత్ర అయితే చేయనని..
ఆ తర్వాత ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత ఎన్నికలు డిక్లేర్ అయ్యాక చాన్సిలర్గా ఇందిరా గాంధీ ఉండటానికి వీల్లేదని సీతారం ఏచూరి ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా జరిగింది. 550 మంది విద్యార్థులు కలిసి ఇందిరా గాంధీ నివాసానికి మార్చ్ చేశారు. ఐదుగురు విద్యార్థులు లోనికి రావాలని ఇందిరా గాంధీ సూచించగా.. వస్తే తామంతా వస్తామని లేదంటే ఎవరమూ రాబోమని సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. దీంతో ఇందిరా గాంధీ బయటికి వచ్చి వారి డిమాండ్లు విని జేఎన్యూ చాన్సిలర్గా రాజీనామా చేశారు.
ఆ తర్వాత అదే విద్యార్థులు యూనివర్సిటీకి ప్రధాని చాన్సిలర్గా ఉండాల్సిన అవసరం లేదని, విద్యావేత్తలు, మేధావులను అందుకు ఎంచుకోవాలనే కొత్త విధానం అమల్లోకి రావడానికి పోరాడారు. వాస్తవానికి ఇందిరా గాంధీ అప్పటికే ప్రధాని పదవి కోల్పోయారు. అయినా.. జేఎన్యూ చాన్సిలర్గానే కొనసాగారు. అప్పుడు వీరంతా కలిసి నిరసనలు చేసి ఆమెతో రిజైన్ చేయించారు.