INS Vagir : భారత నౌకాదళంలోకి మరో అస్త్రం చేరింది. జలాంతర్గామి ఐఎన్ఎస్ వగీర్ను నౌకాదళానికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ పాల్గొన్నారు. ఈ సబ్మెరైన్తో భారత నౌకాదళ సామర్థ్యాలు మెరుగుపడతాయని నౌకాదళం తెలిపింది. దేశాన్ని ఇది శత్రువుల నుంచి కాపాడుతుందని ప్రకటించింది. సంక్షోభ సమయంలో కీలకమైన నిర్ణయాత్మకమైన ఇంటెలిజెన్స్, నిఘా, పర్యవేక్షణలను అందిస్తుందని వెల్లడించింది.
వగీర్’ అంటే షార్క్చేప . ప్రాజెక్టు 75 కింద నిర్మించిన ఐదో డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ వగీర్ . దేశీయంగా నిర్మించిన అత్యాధునిక సబ్మెరైన్లలో ఇదొకటి. ఈ జలాంతర్గామిని 2020 నవంబర్లోనే ఆవిష్కరించారు. నాటి నుంచి ఫిబ్రవరి 2022 వరకు సముద్రంలో ఆయుధాలు, సోనార్లు సహా వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. గతంలో భారత్లో నిర్మించిన సబ్మెరైన్లు అన్నింటిలో వగీర్నే అత్యంత వేగంగా నిర్మించారు.
వగీర్ పేరును 1973-2001 వరకు వినియోగించిన ఓ పాత సబ్మెరైన్ నుంచి తీసుకొన్నారు. ఈ కొత్త సబ్మెరైన్ను మాజిగావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించింది. దీనికోసం ఫ్రాన్స్ టెక్నాలజీని అందించింది. ఈ సబ్మెరైన్లో ప్రపంచంలోనే అత్యుత్తమ సోనార్లను అమర్చారు. దీనిలో వైర్ గైడెడ్ టార్పిడోలు ఉన్నాయి. ఈ జలాంతర్గామి నుంచి సబ్ సర్ఫేస్ టూ సర్ఫేస్ క్షిపణులను ప్రయోగించే అవకాశం ఉంది. దీంతో ప్రత్యర్థి నౌకాదళంపై వేగంగా దాడి చేసే సామర్థ్యం కలుగుతుంది. స్పెషల్ ఆపరేషన్ల కోసం శత్రు స్థావరాల్లోకి మెరైన్ కమాండోలను పంపించే సామర్థ్యం ఈ జలాంతర్గామికి ఉంది. సముద్రం మధ్యలో, తీరాలకు అత్యంత సమీపంలో కూడా ఐఎన్ఎస్ వగీర్ ను మోహరించవచ్చు. నిశ్శబ్దంగా పనిచేయడం ఈ జలాంతర్గామి మరో ప్రత్యేకత.