Indian Navy Rescue: అరేబియా సముద్రంలో భారత నౌకాదళానికి చెందిన మెరైన్ కమాండోలు సత్తా చూపారు. సముద్రపు దొంగలు హైజాక్ చేసిన వాణిజ్య నౌకను రక్షించారు. అందులో చిక్కుకున్న 15 మంది భారతీయులతో సహా 21 మంది సిబ్బందిని కాపాడారు. వాణిజ్య నౌక ఎం.వి.లీలా నార్ ఫోక్ హైజాక్ అయినట్లు శుక్రవారం ఉదయం యునైటెడ్ కింగ్ డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ నుంచి నౌకాదళానికి సమాచారం అందింది. తక్షణమే భారత నౌకాదళం.. ఐఎన్ఎస్ చెన్నై డిస్ట్రాయర్ నౌకను, ఒక యుద్ధ విమానాన్ని, డ్రోన్లను రంగంలోకి దింపింది.
హైజాక్ అయిన నౌకలోని సిబ్బందితో సంబంధాలు ఏర్పరచుకుంది. నౌకను విడిచి వెళ్లిపోవాల్సిందిగా హైజాకర్లను హెచ్చరించింది. అనంతరం భారత మెరైన్ కమాండర్లు నౌకలోకి ప్రవేశించి.. ఒక గదిలో దాక్కున్న సిబ్బందిని కాపాడారు. అప్పటికే హైజాకర్లు పారిపోయారని భారత నౌకాదళం తెలిపింది. సోమాలియా తీరంలో లైబీరియా జెండాతో ఉన్న కార్గో షిప్ను…సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. ఈ షిప్లో 15 మంది భారతీయ సిబ్బంది ఉండటం ఆందోళన కలించింది. షిప్ హైజాక్ అయిన విషయాన్ని నిన్న సాయంత్రం ఇండియన్ నేవీ గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు INS చెన్నై యుద్ధ నౌకను రంగంలోకి దించారు. అలా అందరినీ రక్షించారు.