Indian Constitution Day : రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేసిన కమిటీలన్నీ చేసిన కృషి కారణంగా 1949 నవంబర్ 26 నాటికి రాజ్యాంగ రచనా ప్రక్రియ పూర్తయింది. అదే రోజున.. భారత రాజ్యాంగసభ సమావేశమై, భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. రాజ్యాంగం ఆమోదించబడిన ఆ రోజునే మనం భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
మొత్తం 299 మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ సభ తొలి సమావేశం..1946 డిసెంబర్ 9 వ జరిగింది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ అధ్యక్షుడిగా ఉన్న రాజ్యాంగ రచనా కమిటీ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి రాజ్యాంగాన్ని తయారుచేసింది. దీనికోసం.. రాజ్యాంగ సభ 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది. ఈ క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు రాగా, వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్కరించారు. రాజ్యాంగసభకు తెలుగు వాడైన బి.ఎన్.రావు సలహాదారుగా పనిచేశారు.
మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి సుమారు రూ.64 లక్షలు ఖర్చు అయ్యింది. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత (చేతితో రాసినది) రాజ్యాంగం మన భారతదేశానిదే. జపాన్, ఐర్లాండ్ ఇంగ్లండ్, యూఎస్ఏ, ఫ్రాన్స్.. లాంటి దేశాల రాజ్యాంగాల నుంచి పలు అంశాలను సేకరించి, స్వీకరించిన కారణంగా మన రాజ్యాంగాన్ని ‘బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్’ అని సరదాగా అంటారు.
రాజ్యాంగం మొత్తాన్ని ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాదా.. ఇటాలిక్ కాలిగ్రఫీ స్టైల్లో రాశారు. కొందరు కళాకారులు దీనిని అందంగా తీర్చిదిద్దారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో రచన జరిగింది. నాటి ఒరిజనల్ రాజ్యాంగ ప్రతిని పార్లమెంటు భవనంలోని గ్రంథాలయంలో హీలియం వాయువు నింపిన బాక్స్లో భద్రపరిచారు.
1950 జనవరి 24న రాజ్యాంగ సభ సభ్యులు 284 మంది రాజ్యాంగ ప్రతి మీద సంతకాలు చేశారు. ఆ సమయంలో వానజల్లులు పడుతూ ఉండడం శుభ శకునంగా భావించారట. మరో రెండు రోజులకు.. అనగా జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
2015లో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా జరపాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. నాటి నుంచి నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.