International Space Station: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇస్రో, అమెరికాకు చెందిన నాసాలు కలిసి చేపడుతున్న మిషన్లో భాగంగా భారత వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించనున్నారు. వీరిని వచ్చే ఏడాది పంపిస్తారని తాజాగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా భారత వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లుతారని వివరించారు.
గ్రూప్ కెప్టెన్లుగా గుర్తింపు పొందిన శుభాన్షు శుక్లా, ప్రశాంత్ బాలక్రిష్ణన్ నాయర్లు ఈ మిషన్ కోసం ఇప్పటికే శిక్షణ పొందుతున్నారు. యాక్జియమ్ స్పేస్ మిషన్ కోసం వీరు అమెరికాలో శిక్షణ పొందుతున్నారు. శుక్లాను ఈ మిషన్ కోసం ఇస్రో ఎంపిక చేయగా.. ఆయనకు బ్యాకప్గా బాలక్రిష్ణన్ నాయర్ ఉంటాడు.
గతేడాది ఆగస్టు 23వ తేదీన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ అయింది. ఈ ఘట్టాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా ఈ వేడుకలు ఆగస్టు 23న జరగనున్నాయి. ఈ వేడుకల సందర్భంగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ బుధవారం ఈ మేరకు వెల్లడించారు. ‘వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా భారత వ్యోమగామి ఐఎస్ఎస్కు వెళ్లుతారు’ అని చెప్పారు.
చంద్రయాన్ 3 మిషన్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఇస్రో ఆగస్టు 23వ తేదీన విడుదల చేయనుంది. గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం కోసం ఒక వేయికి మించి ఈవెంట్లు నిర్వహించారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భరత మండపంలో నిర్వహించే జాతీయ అంతరిక్ష దినోత్సవాలకు హాజరుకానున్నారు. భారతీయ అంతరిక్ష హాకథాన్, ఇస్రో రోబొటిక్స్ చాలెంజ్లలో గెలుపొందిన వారికి రాష్ట్రపతి ప్రైజులు అందిస్తారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన తొలి రోవర్ భారత అంతరిక్ష కేంద్రం ప్రయోగించినదే కావడం విశేషం.