Indian Air Force : చైనా చర్యలకు దీటుగా బదులిచ్చేందుకు భారత్ సర్వ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే వాస్తవాధీన రేఖ వద్ద ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విన్యాసాలు చేసేందుకు భారత వాయుసేన సిద్ధమైంది. తూర్పు సెక్టర్లోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో ఫైటర్జెట్లు, హెలీకాప్టర్లు, డ్రోన్లతో విన్యాసాలు చేపట్టనుంది.
మళ్లీ ఉద్రిక్తతలు ఎందుకంటే..?
లద్దాఖ్ సరిహద్దుల్లో యుద్ధ సన్నద్ధతను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సమీక్షించారు. లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న పీపుల్ లిబరేషన్ ఆర్మీతో అధ్యక్షుడు జిన్పింగ్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారిని యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? అని జిన్ పింగ్ ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. పీఎల్ఏ ప్రధాన కార్యాలయం నుంచి ఆర్మీ జవాన్లతో మాట్లాడిన జిన్పింగ్.. యుద్ధ సన్నద్ధత, సరిహద్దుల్లో పరిస్థితుల గురించి ఆరా తీశారని చైనా అధికారిక మీడియా వెల్లడించింది. దీంతో భారత్ అప్రమత్తమైంది.
ప్రళయ్ విన్యాసాలకు రెడీ..
డ్రాగన్ ను కుట్రలను తిప్పికొట్టేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేస్తోంది భారత్. ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్లో ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు ‘ప్రళయ్’ పేరుతో కమాండ్ స్థాయి విన్యాసాలు చేపట్టేందుకు భారత వాయుసేన సిద్ధమైందని సమాచారం. హసిమారా, తేజ్పుర్, చబువా లాంటి ఎయిర్బేస్ల నుంచి ఈ విన్యాసాలు చేపట్టనున్నారు. రఫేల్, సుఖోయ్-30 ఎంకేఐ లాంటి ఫైటర్ జెట్లు, చినూక్, అపాచీ హెలీకాప్టర్లు, సీ-130జే సూపర్ హెర్క్యూల్స్ ఎయిర్క్రాఫ్ట్, డ్రోన్లు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయని తెలుస్తోంది.
గతేడాది డిసెంబర్ 15-16 తేదీల్లో తూర్పు సెక్టార్లోని వాస్తవాధీన రేఖ వెంట వాయుసేన పనితీరును పరిశీలించేందుకు ఈస్ట్రన్ కమాండ్ రెండు రోజులపాటు యుద్ధ విన్యాసాలు చేపట్టింది. డిసెంబర్ 9న అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో భారత్-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగిన వారం రోజుల వ్యవధిలోనే ఈ విన్యాసాలు జరిగాయి. ఈ ఘర్షణతో యుద్ధ విన్యాసాలకు ఎలాంటి సంబంధం లేదని అప్పుడు వాయుసేన ప్రకటించింది. మరి జిన్ పింగ్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలోనే భారత్ తన అస్త్రాలను సిద్ధం చేస్తోంది.