E-Visa Services : రెండునెలల సుదీర్ఘ విరామం తర్వాత.. కెనడా పౌరుల కోసం భారత్ ఎలక్ట్రానిక్ వీసా సేవలను పునరుద్ధరించిందని కేంద్రవర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది జూన్ లో కెనడా పౌరుడు, ఖలిస్తానీ ఉగ్రవాది అయిన హర్దీప్ సింగ్ నిజ్జార్ ను జూన్ లో హతమార్చడంతో రెండు దేశాల మధ్య వైరం ఏర్పడింది. నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా చేసిన వాదనలతో.. దౌత్యపరమైన వివాదం నెలకొంది. దాంతో ఈ ఏడాది సెప్టెంబర్ 21 నుంచి భారత్ వీసా సేవల్ని నిలిపివేసింది. తదుపరి నోటీసు వచ్చేంతవరకూ వీసాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
తాజాగా ఇప్పుడు టూరిస్ట్ వీసాలు సహా.. ఎలక్ట్రానిక్ వీసా సేవలు పునరుద్ధరించబడ్డాయి. అక్టోబర్ 26 నుంచి కెనడా పౌరులకు ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసా కేటగిరీల్లో సేవలను పునరుద్ధరించారు. దీంతో అన్ని రకాల సేవలను కెనడా పౌరులకు పునరుద్ధరించినట్లైంది. జీ20 వర్చువల్ సదస్సుకు ముందు ఈ సమాచారం వెలువడటం గమనార్హం.
కాగా.. నిజ్జర్ హత్యలో తమ ప్రమేయం ఉందని భారత్ పై ఒట్టావా చేసిన ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను పంచుకోవాలని భారత్ అప్పట్లో డిమాండ్ చేసింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గత వారం భారతదేశ డిమాండ్ను పునరుద్ఘాటించారు. యునైటెడ్ కింగ్డమ్లో జరిగిన ఒక కార్యక్రమంలో.. కెనడా విచారణకు సహకరించాల్సిందిగా భారత్ను పురికొల్పుతున్న సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, “మేము దర్యాప్తును తోసిపుచ్చడం లేదు కానీ.. కెనడియన్ ప్రభుత్వానికి ఈ ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలుంటే తమకు చూపించాలన్నారు. కాగా.. బుధవారం సాయంత్రం జరగనున్న జీ20 వర్చువల్ సదస్సుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా పాల్గొననుండటం చర్చనీయాంశమైంది.